సమ్మె సైరన్: నోటీసు ఇచ్చిన ఆర్టీసి సిబ్బంది
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టీసి)లో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను వెంటనే అమలు చేయని పక్షంలో వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసి గుర్తింపు సంఘాలు ఎంప్లాయిస్ యూనియన్, టిఎంయూ ప్రకటించాయి. ఈ వివరాలను ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె పద్మాకర్ శుక్రవారం ఇక్కడ మీడియాకుతెలిపారు.
ఆర్టీసి ఎండిని కలిసి సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఆర్టీసిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, కాంట్రాక్టు విధానం రద్దు, కారుణ్య నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇంటీరియం రిలీఫ్, తదితర డిమాండ్లపై ప్రభుత్వంతో తమ సంఘాలు ఒప్పందం ఖరారు చేసుకున్నాయన్నారు. ఈ ఒప్పందాలను వెంటనే అమలు చేయాలన్నారు. లేని పక్షంలో సమ్మె తప్పదని ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె పద్మాకర్, టిఎంయు ప్రధాన కార్యదర్శి ఇ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు.
ఆర్టీసి కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గతంలో యూనియన్తో చేసుకున్న ఒప్పందాలు అమలు చేయనందున ఈ నెల 20వ తేదీ తర్వాత గుర్తింపు సంఘంగా చేపట్టే ఆందోళనా కార్యక్రమాలకు మద్దతు పలకాలని ఇతర కార్మిక సంఘాలుక ఊడా ఆర్టీసి యూనియన్కు లేఖ రాశాయన్నారు. తమ డిమాండ్ల విషయంలో ఎటువంటి రాజీ లేదని చెప్పారు.
ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంలో కూడా తాత్సారం చేస్తున్నారన్నారు. కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో యాజమాన్యం విఫలమైందన్నారు.