కూటమికి మద్దతుగా వైసీపీ..! తొలిసారి లోకేష్ మాటకు సై..!
ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీపై పోరాటం కోసం ఏకమైన కూటమి పార్టీలు విజయవంతంగా అధికారంలోకి వచ్చాయి. అనంతరం ఏడాదిన్నరగా ఎలాంటి విభేదాలు లేకుండా కూటమిని నడుపుతున్నాయి. అయితే వైసీపీ విషయంలో కూటమి, కూటమి ప్రభుత్వం విషయంలో వైసీపీ ఉప్పూ నిప్పూగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఇవాళ ఓ విషయంలో మాత్రం కూటమి, వైసీపీ ఏకమయ్యాయి.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చర్చ జరిగింది. దీనిపై మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. ఎట్టి పరిస్ధితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని హామీ ఇచ్చారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా ఆపిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో వైసీపీ వైఖరేంటని ఆయన ప్రశ్నించారు. దీంతో విపక్షం ఇరుకునపడింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపినందుకు ప్రధాని మోదీ, ఆర్దికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , ఉక్కుశాఖ మంత్రి హెచ్డి కుమార స్వామిని అభినందిస్తూ మండలిలో లోకేష్ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే ఈ అభినందన తీర్మానాన్ని అంగీకరిస్తున్నారా లేదా అని విపక్ష వైసీపీని నిలదీసిన కూటమి ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. దీనిపై మల్లగుల్లాలు పడిన వైసీపీ చివరికి లోకేష్ పెట్టిన తీర్మానాన్ని అంగీకరిస్తున్నట్లు తెలిపింది. దీంతో మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజు ప్రకటించారు.

వాస్తవానికి ఉదయం నుంచీ వేర్వేరు అంశాలపై కూటమి పార్టీలకూ, వైసీపీకి మధ్య పెద్ద వార్ నడిచింది. సభ్యులు తీవ్ర వాదోపవాదాలు కూడా చేసుకున్నారు. కానీ చివరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో, అదీ కేంద్రానికి మద్దతు విషయంలో మాత్రం అన్ని పార్టీలు ఏకమై ఏకగ్రీవంగా తీర్మానం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications