వైసీపీ సోషల్ మీడియాకు షాక్ - వైఎస్ జగన్ కుడిభజంగా ఉన్న విభాగంలో..!!
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగానికి.. అత్యంత శక్తిమంతమైన నెట్వర్క్గా పేరుంది. ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండదండగా ఉంటూ వస్తోన్న విభాగం ఇది. వైఎస్ కుటుంబంపై ఉన్న వ్యక్తిగత అభిమానంతో లక్షలాది మంది స్వచ్ఛందంగా వైసీపీకి అనుకూలంగా పని చేస్తోన్నారు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా. ఆ విషయం పలు సందర్భాల్లో బహిర్గతమైంది కూడా.
లక్షలాది మంది..
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను గానీ, అభివద్ధి ప్రాజెక్టులను గానీ ప్రజల వద్దకు చేరవేయడంలో ఈ విభాగం కీలక పాత్రను పోషిస్తోంది. సామాన్యుల వద్దకు చేర్చడంలో సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు విస్తృతంగా పని చేస్తోన్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కుమారుడు భార్గవ- ఆ విభాగానికి అధిపతిగా పని చేస్తోన్నారు. ఇటీవలే వైసీపీ అగ్రనాయకత్వం ఆయనను అపాయింట్ చేసింది.
కలకలం..
అలాంటి బలమైన నెట్వర్క్ను కలిగివున్న వైసీపీ సోషల్ మీడియాలో తాజాగా కలకలం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్కు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని హ్యాక్ చేశారు. నాన్ ఫింజిబిల్ టోకెన్ (ఎన్ఎప్టీ)కి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్కు సంబంధించిన ఓ న్యూస్ ఆర్టికల్ను పిన్డ్ టాప్ చేశారు. బిట్ కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీకి ప్రమోషనల్ ఆర్టికల్స్ ఇందులో పోస్ట్ అయ్యాయి.
యూఎస్ నుంచి..
లక్షలాది మంది సోషల్ మీడియా యూజర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఫాలో అవుతున్న అకౌంట్ ఇది. ప్రొఫైల్లో ఎన్ఎఫ్టీ మిలియనీర్ అని రాసుకొచ్చారు. అమెరికా నుంచి హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. లొకేషన్ను యూఎస్ఏగా మార్చారు. వైసీపీకి సంబంధించిన కొత్త సమాచారం గానీ, అప్డేట్స్ గానీ ఇందులో పోస్ట్ కాలేదు. ఈ ఎన్ఎఫ్టీకి చెందిన ప్రమోషనల్ ఆర్టికల్స్ను రీట్వీట్ చేశారు.
చివరి పోస్ట్ అదే..
జీ20 సన్నాహాక సదస్సుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్ పాల్గొన్నప్పటి సమాచారమే చివరిది. శనివారం రాత్రి 8:18 నిమిషాలకు ఇది పోస్ట్ అయింది. ఆ తరువాత వైసీపీ అప్డేట్స్ ఏవీ కూడా ఇందులో పోస్ట్ కాలేదు. దీన్ని రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేపట్టామని వైసీపీ సోషల్ మీడియా విభాగం తెలిపింది. త్వరలోనే సాధారణ స్థితికి తీసుకొస్తామని పేర్కొంది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న కారణంగానే హ్యాకర్లు ఈ ట్విట్టర్ హ్యాండిల్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.