సబ్బంతో సంబంధం లేదు: శోభా, బాధేస్తుందని మాణిక్య
హైదరాబాద్/న్యూఢిల్లీ: అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు శోభా నాగి రెడ్డి శుక్రవారం అన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడారు. సబ్బం హరికి తమ పార్టీలో ప్రాథమిక సభ్యత్వమే లేదని స్పష్టం చేశారు. ఆయన ఎక్కడో ఏదో మాట్లాడితే తమ పార్టీ స్పందించదని చెప్పారు. సబ్బం హరి చేసిన వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నిస్తే శోభా నాగి రెడ్డి పై విధంగా మాట్లాడారు.
తెలంగాణపై మా వైఖరిలో మార్పు లేదు: రాజ్ నాథ్
తెలంగాణ విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ శుక్రవారం చెన్నైలో అన్నారు. పొత్తుల అంశంపై తెలుగుదేశం పార్టీ నుండి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో ముగిసిన దీక్ష
దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర ఉద్యోగుల దీక్ష శుక్రవారం సాయంత్రం ముగిసింది. దీక్షా కేంద్రం సమైక్య నినాదాలతో హోరెత్తింది. కేంద్రం విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, పదమూడు మందికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
బాధ కలిగిస్తోంది: మాణిక్య
ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని చూస్తుంటే తనకు చాలా బాధ కలుగుతుందని మంత్రి మాణిక్య వరప్రసాద్ అన్నారు. అక్టోబర్ 2వ తేదిన తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. రాజీనామాలు సమస్యకు పరిష్కారం కావన్నారు.