సచిన్ దత్తత గ్రామంలో ఎక్కడి గొంగళి అక్కడే
నెల్లూరు: ప్రముఖ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న గ్రామంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గల పుట్టమరాజు కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రామంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ మేరకు స్థానిక మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.
వాటర్ పైప్లైన్లకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రెయిన్స్, రోడ్లు, ఇళ్ల పథకం వంటివాటిలో ఏ మాత్రం ప్రగతి కనిపించడం లేదని మీడియాలో కథనాలు వచ్చాయి. గ్రామంలోని పారిశుధ్య పరిస్థితి పట్ల కూడా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో పుట్టమరాజు కండ్రిగకు అప్పటి కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ రూ.3.05 కోట్లు విడుదల చేసినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత తన ఎంపి లోకల్ ఏరియా డెవలప్మెంట్ నిధుల నుంచి సచిన్ టెండూల్కర్ రూ.2.79 కోట్లు కేటాయించినట్లు సమాచారం. అయితే, పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అయితే, సచిన్ టెండూల్కర్ గ్రామాన్ని సందర్శించినప్పుడు ప్రజలను విపరీతంగా ఆశపెట్టారు. రాత్రికి రాత్రే గ్రామం మారిపోతుందనే ఊహలకు ప్రాణం పోశారు. ఈ అతి కూడా గ్రామ ప్రజల అసంతృప్తికి కారణమవుతోంది.
నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం ఈ గ్రామసమస్య. కాగా, పుట్టమరాజు కండ్రిగలో పనులు నడుస్తున్న తీరును జిల్లా కలెక్టర్ ఎం జానకి సంబంధిత అధికారులతో బుధవారంనాడు సమీక్షించారు. గ్రామంలో పనులను వేగంగా నడిపించే బాధ్యతను జాయింట్ కలెక్టర్ ఎండి ఇంతియాజ్కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు గూడూరు ఆర్డివో ఆధ్వర్యంలో పనులు జరిగేవి.