బీజేపీలో చేరిన సాదినేని యామిని: కడపలో సీఏఏకు మద్దతుగా భారీ ర్యాలీ
కడప: తెలుగుదేశం మాజీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం కడప జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. గజేంద్ర సింగ్ షెకావత్ ఆమెకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

చంద్రబాబు మద్దతంటూనే టీడీపీకి రాజీనామా..
తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న యామిని శర్మ.. గత నవంబర్లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి యామిని రాజీనామా చేశారు. తన వ్యక్తిగతమైన, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర బలమైన కారణాలతో టీడీపీని వీడినట్లు ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. టీడీపీలో చంద్రబాబు మద్దతుగా ఉన్నారంటూనే ఆమె ఆ పార్టీకి రాజీనామా చేశారు.

కడపలో భారీ ర్యాలీ..
టీడీపీ వీడిన నాటి నుంచి యామిని శర్మ బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆమె ఇప్పుడు బీజేపీలో చేరారు. ఆమెతోపాటు మరికొంత మంది కూడా బీజేపీలో చేరారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, తదితరులు ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అవగాహన కల్పించేందుకు కడపలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన ర్యాలీలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొని ప్రసంగించారు. సీఏఏపై అవగాహన లేని కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆయన ఆరోపించారు.

అవగాహన లేకే తప్పుడు ప్రచారం..
సీఏఏపై కాంగ్రెస్ నేతలకు సరైన అవగాహన లేదని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు. ఈ చట్టం ఏ ఒక్క మతానికి, కులానికి సంబంధించినది కాదని గజేంద్ర సింగ్ అన్నారు. భారతీయులైన ముస్లిం సోదరులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మున్సిపల్ మైదానం నుంచి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దియోధర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications