టిడిపిలో చేరిన సాయిప్రతాప్, సీఎం రమేష్ చక్రం: జగన్కు కడపలో చిక్కులే!
హైదరాబాద్/విజయవాడ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సాయి ప్రతాప్ గురువారం ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన సైకిల్ ఎక్కారు. పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీ అధినేత ఆహ్వానించారు.
జగన్కు షాకే!
సాయి ప్రతాప్ టిడిపిలో చేరడం వైసిపి అధినేత జగన్కు గట్టి షాకేనని చెప్పవచ్చు. ఇప్పటికే సొంత ఇలాకా కడపలో సొంత పార్టీకి చెందిన నేతలు సైకిల్ ఎక్కారు. ఇప్పుడు సొంత జిల్లాకు చెందిన బలమైన నేత, కాంగ్రెస్ సీనియర్ నేత సాయి ప్రతాప్ చేరడం కూడా కడపలో జగన్కు ఝలక్ అని చెప్పవచ్చు.
సాయి ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ నేత అయినప్పటికీ కడప జిల్లాలో బలమైన నేత కావడం గమనార్హం. కడప జిల్లా రాజంపేట లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటిదాకా తొమ్మిదిసార్లు పోటీ చేసిన సాయిప్రతాప్ ఆరుసార్లు విజయం సాధించారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి సాయిప్రతాప్ అత్యంత సన్నిహితుడిగా భావించేవారు. వైయస్ అనుచరుడుగానే ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది. ఐదుసార్లు సుదీర్ఘకాలం పాటు ఎంపీగా కొనసాగిన సాయి ప్రతాప్.. వైయస్ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రంలోని యూపీఏ కేబినెట్ లో ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.
రాజంపేట నియోజకవర్గ భౌగోళిక స్వరూపం నేపథ్యంలో ఇటు కడప జిల్లాలోనే కాక అటు చిత్తూరు జిల్లాలోనూ సాయిప్రతాప్కు మంచి పట్టుంది. వైయస్ మరణానంతరం సాయిప్రతాప్ వైసీపీలో చేరడం ఖాయమన్న వాదన వినిపించింది. అయితే తన తండ్రి సమకాలీనుడైన సాయిప్రతాప్ను జగన్ అంతగా పట్టించుకోలేదంటారు.
చక్రం తిప్పిన సీఎం రమేష్
దీంతో, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు టిడిపిలో చేరారు. సాయి ప్రతాప్ను టిడిపిలోకి తీసుకు రావడంలో సీఎం రమేషఖ్ చక్రం తిప్పారని తెలుస్తోంది. టిడిపిలోకి రావాలన్న సీఎం రమేశ్ ఆహ్వానానికి సాయిప్రతాప్ సానుకూలంగా స్పందించారు.












Click it and Unblock the Notifications