వైఎస్ జగన్- ఓ సోషల్ ఇంజినీర్: తనకు తాను పరీక్ష పెట్టుకున్నాడు..!!
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఓ రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నారని, అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లల్లోనే విప్లవాత్మక సంస్కరణలను అమలు చేశారని పేర్కొన్నారు.

అట్టడుగు వర్గాలు అత్యున్నత స్థాయి..
అట్టడుగు వర్గాలు అత్యున్నతస్థాయికి చేరుకున్నప్పుడే నిజమైన సమ సమాజం ఏర్పడుతుందని నమ్మిన జాతిపిత మహాత్మా గాంధీ, జ్యోతిబా పూలే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహా నాయకులు కన్న కలలను జగన్ నిజం చేస్తున్నారని అన్నారు. దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించి, అట్టడుగు కులాలవారిని దారుణంగా అవమానించారని గుర్తుచేశారు.

అప్పటి పరిస్థితులు.. ఇప్పుడు బేరీజు..
మూడున్నరేళ్ల కిందట రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి?.. 2019లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏం జరిగిందనేది అందరికీ తెలుసని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమ ఇళ్ల ముందుకే వస్తోన్నాయని, అవి ఎలా అమలు అవుతున్నాయనేది మన కళ్ల ముందే కనిపిస్తోందని చెప్పారు. గ్రామాలు, పట్టణాలు, పేదల ఇళ్లు, కాలనీలు ఎలా తయారవుతున్నాయో అందరూ చూస్తున్నారని అన్నారు.

తమ పార్టీ డీఎన్ఏలోనే..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమ పార్టీ డీఎన్ఏలో ఉన్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీలు సహజమైన కుటుంబ సభ్యులు అని అభివర్ణించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో విద్యా, వైద్య రంగంలో కీలకమైన ఫీజురీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారని, నేరుగా వెనుకబడిన వర్గాలకు విద్యను అందించడం ద్వారా వారి సాధికారతకు పాటుపడ్డారని చెప్పారు.

మహిళలకు రిజర్వేషన్లు..
పార్లమెంట్లో మహిళా బిల్లును రానివ్వట్లేదని, అలాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్- తనకు తాను పరీక్ష పెట్టుకున్నారని, చట్టాన్ని తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేశారని చెప్పారు. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. రెండే రెండు పేజీల మేనిఫెస్టోను రూపొందించి, అందులో పొందుపరిచిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని అన్నారు.

అందుకే ఇంగ్లీష్ మీడియం..
ఇంగ్లీష్పై మోజుతోనో.. లేక తెలుగుపై కోపంతోనో వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టలేదని, దాని అవసరాన్ని గుర్తించడం వల్లే అమలు చేస్తోన్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. తమ రాష్ట్రానికి చెందిన పేద, గ్రామీణస్థాయి విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించాలని ఇంగ్లీష్ను ప్రోత్సహిస్తోన్నారని తెలిపారు. టాప్ 100 ఇంటర్నేషనల్ యూనివర్సిటీల్లో పేద విద్యార్థులు సీటు తెచ్చుకుంటే ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వమే భరిస్తోందని అన్నారు.












Click it and Unblock the Notifications