సజ్జల కుమారుడి పొలిటికల్ ఎంట్రీ - వైసీపీలో కీలక పదవి?
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కుమారుడు భార్గవ.. రాజకీయ అరంగేట్రం చేసినట్టే కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీలో ఆయనకు కీలక పదవి లభించిందనే ప్రచారం సాగుతోంది. పార్టీకి పెట్టని కోటగా ఉంటూ వస్తోన్న సోషల్ మీడియా విభాగాధిపతిగా సజ్జల భార్గవను అపాయింట్ చేశారని చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్థానంలో భార్గవను నియమించినట్లు సమాచారం.

స్వచ్ఛంగా లక్షలాది మంది..
వైసీపీ సోషల్ మీడియా అత్యంత శక్తిమంతమైనదంటూ ఇదివరకే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. వైఎస్ కుటుంబంపై ఉన్న వ్యక్తిగత అభిమానంతో లక్షలాది మంది స్వచ్ఛందంగా వైసీపీకి అనుకూలంగా పని చేస్తోన్నారనే విషయం బహిరంగ రహస్యమే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. అనంతరం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సామాన్యుల వద్దకు చేర్చడంలో సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు విస్తృతంగా పని చేస్తోన్నారు.

సజ్జల భార్గవకు..
అలాంటి కీలకమైన విభాగానికి అధిపతిగా సజ్జల భార్గవను నియమించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి కార్యకలాపాలతో విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోన్నందున- ఆయనకు బదులుగా భార్గవకు ఆ బాధ్యతలను అప్పగించాలని వైఎస్ జగన్ భావించినట్లు చెబుతున్నారు. వచ్చే మూడు సంవత్సరాలు అత్యంత కీలకమైనవి కావడం వల్ల సాయిరెడ్డి ఇక పూర్తిస్థాయిలో రాజకీయ కార్యకాలాపాలను నిర్వహించడానికి సమయాన్ని కేటాయించడానికి వీలుగా ఈ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.

డిజిటల్ క్యాంపెయిన్..
తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, జిల్లాస్థాయిలో సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, ఐ-ప్యాక్ టీమ్ లీడ్ పాల్గొన్నట్లు సమాచారం. సజ్జల భార్గవ కూడా దీనికి హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా భార్గవకు ఈ పదవికి అప్పగించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. కొత్తగా డిజిటల్ క్యాంపెయిన్ కోసం కూడా పలువురిని అపాయింట్ చేయాల్సి ఉంటుందని, నియోజక వర్గాల వారీగా వారి సేవలను వినియోగించుకోవాలని పార్టీ అగ్ర నాయకత్వం భావిస్తోంది.

విమర్శలపై ఎదురుదాడులకూ..
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన ప్రాజెక్టులపై సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడానికి అవసరమైన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను సజ్జల భార్గవ ఇచ్చారని, వాటి పట్ల వైసీపీ అగ్రనాయకత్వం సంతృప్తిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం, పార్టీపై ఎలాంటి విమర్శలు వచ్చినా- వాటిని అదే వేగంతో తిప్పి కొట్టేలా, వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించేలా చేయడంలో మున్ముందు సోషల్ మీడియా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఇప్పటికే
ప్రతీ జిల్లాకు సోషల్ మీడియా నుంచి కన్వీనర్, కో-కన్వీనర్లను ఇప్పటికే నియమించారు వైసీపీ నాయకులు. వారికి వర్క్ షాపులను కూడా నిర్వహించారు. వచ్చే రెండేళ్ల సమయం కీలకంగా మారినందున- ఇకపై సోషల్ మీడియాకు పూర్తిస్థాయి హెడ్ అవసరమైందని, ఆ స్థానంలో భార్గవను నియమించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications