దానిని మేం కాదనడంలేదుగా: సజ్జల రామకృష్ణారెడ్డి
ఇంటిలిజెన్స్ చీఫ్ నుంచి మెసేజ్ వెళ్లిందని, దాన్ని ఎవరూ కాదనడంలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
ఫోన్ ట్యాపింగ్ కు కుట్ర పన్నింది చంద్రబాబునాయుడని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణల వెనక ఉన్న ఉద్దేశాలు ఎవరివో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. కోటంరెడ్డి లాంటివారు కేవలం పాత్రధారులేనని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నారని, ఇటువంటి చిల్లర అంశాలు పట్టించుకునే సమయం తమకు లేదన్నారు. టీడీపీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయిస్తోందన్నారు.
వచ్చే ఎన్నికల గురించి పార్టీ క్యాడర్ ను అప్రమత్తం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా సమన్వయకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారన్నారు. కోటంరెడ్డి ఆడియోను ఒకరు రికార్డు చేసి బయటకు పంపించారని, రికార్డు చేసిన వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే కోటంరెడ్డికి ఎందుకు పంపిస్తారు.. ఇదంతా బాబు ప్రణాళిక అని, ఆయన వ్యూహంలో భాగంగానే జరిగిందని సజ్జల ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఫిర్యాదు చేయవచ్చని, కానీ అది ట్యాపింగ్ కాదన్నారు.

ఇంటిలిజెన్స్ చీఫ్ నుంచి మెసేజ్ వెళ్లిందని, దాన్ని ఎవరూ కాదనడంలేదని, ఆయన దృష్టికి ఓ ఆడియో వస్తే దానిని శ్రీధర్ రెడ్డికి పంపించారని చెప్పారు. అనవసరంగా లేని సమస్యలను సృష్టిస్తున్నారని చంద్రబాబు నుంచి హామీ వచ్చిన తర్వాతే కోటంరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీచేస్తానని చెబుతున్నారని, అందరూ కలిసి డ్రామాలాడుతున్నారంటూ మండిపడ్డారు. ట్యాపింగ్ కానప్పుడు విచారణ అవసరం లేదన్నారు. చంద్రబాబునాయుడు సమయంలో ఇలాంటివి జరిగాయని, తమకు చాలా పనులున్నాయని, వచ్చే సంవత్సరం ఎన్నికలున్నాయని, వాటిపైనే తాము దృష్టి సారించామని, ఇలాంటి ట్యాపింగ్ లు చేయాల్సిన అవసరం తమకు లేదని మరోసారి సజ్జల చెప్పారు.












Click it and Unblock the Notifications