కేసీఆర్ కు సజ్జల ఘాటు కౌంటర్- మీ రోడ్లేంటో జనానికి తెలుసు-మమ్మల్ని ఫాలో కాలేదా ?
ఏపీలో రోడ్ల పరిస్ధితిపై తాజాగా ఇల్లందు సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి రోడ్ల గురించి మాట్లాడం విచిత్రంగా ఉందన్నారు. అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో అక్కడ ఉన్న తెలంగాణ ప్రజల కి తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కలిపిన పోలవరం ముంపు గ్రామాల్లో ఉన్న ఏడు గ్రామాల ప్రజలు ఏపీలోకి వస్తాం అంటున్నారని సజ్జల గుర్తుచేశారు. ఆ గ్రామల్లో ప్రజలు ఎందుకు వస్తున్నారో కేసీఆర్ ముందు తెలుసుకోవాలన్నారు. ఏపీలో అభివృద్ధి చూసి ఏపీలోకి వస్తున్నామని 7గ్రామాల ప్రజలు చెబుతున్నారన్నారు. ఏపీలో అభివృద్ధి చూసి దేశం మొత్తం గర్విస్తుంది.. కానీ కేసీఆర్ కు కనిపించడం లేదన్నారు.

గతంలో ఏపీలో పింఛన్లు ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకొని తెలంగాణలో కూడా అదే విధంగా అమలు చేయాలని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. అలాగే ఏపీలో పాఠశాలలు తెలంగాణలో పాఠశాలలో పరిశీలిస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో అనేది పూర్తిగా అర్థమవుతుందన్నారు. తద్వారా గతంలో ఏపీలో అభివృద్ధిని గుర్తించి ఇప్పుడు ఎన్నికల నెపంతో విమర్శలు చేస్తారా అని సజ్జల ప్రశ్నించారు.
మరోవైపు అనారోగ్యం బాగాలేదని చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని, కానీ చంద్రబాబు భారీ ర్యాలీ చేపట్టారని సజ్జల ఆరోపించారు. మూడు గంటల్లో రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకోవచ్చని, కానీ రాజమండ్రి నుంచి విజయవాడ రావటానికి చంద్రబాబు 14 గంటలు సమయం పట్టిందన్నారు. అనారోగ్యం ఉన్న వ్యక్తి ఎవరైనా 14 గంటలు కారులో కూర్చుంటారా అని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబునాయుడుకు అర్ధరాత్రి వరకు రోడ్లు మీద ఉండి బ్రహ్మ రథం పట్టారని కొంతమంది వ్యాఖ్యలు చేయటం హాస్యంగా ఉందన్నారు.
హైదరాబాదులో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని, ట్రాఫిక్ జాం ప్రాంతంలో చంద్రబాబు కాన్వాయ్ పెట్టి ప్రజలు భారీగా తరలివచ్చారని చెప్పటం సిగ్గుగా ఉందన్నారు. హైదరాబాదులో చంద్రబాబు అని చూసేందుకు వచ్చింది పచ్చ బ్యాచ్ మాత్రమే అన్నారు.












Click it and Unblock the Notifications