పవన్ టూర్; బలప్రదర్శన అవసరమా? చంద్రబాబు పాలనలో ఎందుకు చెయ్యలేదు? సజ్జల చురకలు
గాంధీ జయంతి నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ శ్రమదానం కార్యక్రమం ఉద్రిక్తతలకు కారణమైంది. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రోడ్ల సమస్యలపై ఆందోళనలు చేసి, ప్రభుత్వం పరిష్కరించడం లేదని, స్వయంగా తనే గాంధీ జయంతి రోజు శ్రమదానం కార్యక్రమం ద్వారా అద్వానంగా ఉన్న రోడ్లపై గుంతలను పూడ్చి గాంధీజీకి నివాళులర్పిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సభ నిర్వహిస్తానని కూడా ప్రకటించారు. ఈ క్రమంలో కరోనా నిబంధనల నేపథ్యంలో శ్రమదానం కార్యక్రమానికి, పవన్ కళ్యాణ్ సభకు అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం పవన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసింది.
పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన రచ్చ .. ప్రభుత్వంపై ధ్వజం
అయినప్పటికీ పవన్ కళ్యాణ్ జోరున వర్షం కురుస్తున్నా రాజమండ్రి లోని హుకుంపేట బాలాజీ పేట రోడ్డులో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఆపై ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. కావాలని ఏపీ ప్రభుత్వం శ్రమదానం కార్యక్రమం చేయకుండా, సభ నిర్వహించకుండా అడ్డుకుంటుందని పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అది ఏపీ ప్రభుత్వ తప్పు అని తనకు తెలుసని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునే అవసరం ఏపీ ప్రభుత్వానికి లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ ఏం నిరూపించాలని అనుకుంటున్నారు : సజ్జల వ్యాఖ్యలు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్ శ్రమదానం కార్యక్రమం పై స్పందించారు. రాష్ట్రంలో కరోనా నిబంధనలు అందరికీ అమలులో ఉన్నాయని, కోవిడ్ ఆంక్షలు కొనసాగుతుంటే వేల మందితో సభ ఎలా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ కార్యక్రమానికి ఎంతమందిని అనుమతించామో చూసే ఉంటారు అని గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసలేం నిరూపించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసమే నిబంధనలు పెట్టామని, ఇలాంటి సమయంలో బలప్రదర్శన వల్ల ఇబ్బంది పడేది ప్రజలే అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
పవన్ టూర్ ఆపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు
అక్టోబర్
నెలలో
కరోనా
కేసులు
పెరిగే
ప్రమాదం
ఉందని
నిపుణులు
చెబుతున్నారని
పేర్కొన్న
సజ్జల
రామకృష్ణారెడ్డి,
పవన్
టూర్
ను
ఆపాల్సిన
అవసరం
ప్రభుత్వానికి
లేదని
పేర్కొన్నారు.
అయినా
రోడ్లపైన
గుంతలు
పూడ్చ
వలసిన
అవసరం
ఏమిటని
ప్రశ్నించారు.
రోడ్లపై
గుంతలు
పూడ్చటం
కోసం
సీఎం
జగన్మోహన్
రెడ్డి
2,200
కోట్ల
రూపాయలు
కేటాయించారని,
వర్షాలు
తగ్గగానే
రోడ్ల
మరమ్మతు
పనులు
చేస్తామంటూ
సజ్జల
రామకృష్ణా
రెడ్డి
ప్రకటించారు.
రోడ్ల
మరమ్మత్తు
పనుల
కోసం
టెండర్ల
ప్రక్రియ
కొనసాగుతుందని
ఆయన
పేర్కొన్నారు.
అప్పుడు పవన్ శ్రమదానం ఎందుకు చెయ్యలేదో ?
తెలుగుదేశం పార్టీ హయాంలో ఎనిమిది వందల కోట్ల పనులు చేపట్టి, బిల్లులు చెల్లించకుండా వెళితే, తాము బిల్లును చెల్లించామంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.తెలుగుదేశం పార్టీ ఐదేళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు అని, మరి అప్పుడు చంద్రబాబు హయాంలో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అంటూ నిలదీశారు. అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ శ్రమదానం చేయలేదు అంటూ మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్మా గాంధీ ఒక యుగపురుషుడు అంటూ కొనియాడారు సజ్జల. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం గాంధీ సూక్తుల ద్వారా బోధించారని, కోట్లాది మంది ప్రజలలో మహాత్మా గాంధీ స్ఫూర్తిని రగిల్చారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ మార్గంలో ప్రయాణించడానికి పునరంకితం అవుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు