టీడీపీ- జనసేన నేతలు టచ్ లో ఉన్నారు, అప్పుడే చేరికలు : సజ్జల..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. టీడీపీ, జనసేన అభ్యర్దుల తొలి జాబితా ప్రకటించారు. రెండు పార్టీల నుంచి 99 మంది అభ్యర్దులను ఖరారు చేసారు. బీజేపీతో పొత్తు అంశం పైన తుది నిర్ణయం వెలువడిన తరువాత ఫైనల్ జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో పార్టీ కీలక నేతలతో సీఎం జగన్ ఎన్నికల సమాయత్తం కోసం సమావేశం ఏర్పాటు చేసారు. టీడీపీ, జనసేన నుంచి టికెట్లు రాని అసంతృప్త నేతలు వైసీపీతో టచ్ లోకి రావటం ఆసక్తి కరంగా మారుతోంది.
సీట్లు - లెక్కలు
టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్లు దక్కని నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కొందరిని చంద్రబాబు, పవన్ నేరుగా బుజ్జగించగా సర్దుకుపోతున్నారు. మరి కొందరు మాత్రం ససేమిరా అంటున్నారు. అనుచర వర్గం ఆ నేతలను స్వతంత్ర అభ్యర్దులుగా పోటీ చేయాలని..మరి కొంత మంది పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ సమయంలోనే వైసీపీలోకి వస్తే ప్రాధాన్యత పైన అధికార పార్టీలో ఉన్న ముఖ్యులతో ఈ అసంతృప్త నేతలు టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ కోర్ టీం ఈ అసంతృప్త నేతలు ఎవరు టచ్ లోకి వస్తున్నారు..ఎవరిని తమ పార్టీలోకి తీసుకుంటే ప్రయోజనం ఉంటుందనే లెక్కలు సిద్దం చేస్తోంది. స్థానిక నయోజకవర్గ ఇంఛార్జ్ లతో చర్చించి..వారి అభిప్రాయాలను సేకరిస్తోంది.

వైసీపీలో చేరికలు
ఈ అసంతృప్త నేతల చేరికలకు సంబంధించి వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణ రెడ్డీ కీలక వ్యాఖ్యలు చేసారు. రేపు (మంగళవారం) పార్టీ ముఖ్య నేతలతో జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో ఎలా పనిచేయాలో చెబుతారని వివరించారు. వైసీపీ అభ్యర్దులు ఎప్పటి నుంచో ప్రజల్లోనే ఉన్నారని వివరించారు. తమ పార్టీ ఎన్నికల కోసం గట్టి టీం ఏర్పాటు చేసుకుందని చెప్పుకొచ్చారు. టిడిపి - జనసేన అతుకుల బొంత గా వ్యాఖ్యానించారు. రెండు పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామన్నారు. టికెట్ల వ్యవహారం, అసంతృప్త నేతల వ్యవహారాలు ఆ రెండు పార్టీల అంతర్గత అంశంగా చెప్పుకొచ్చారు. చేరికలు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు.
తేల్చేసిన సజ్జల
అదే సమయంలో టిడిపి - జనసేన అసంతృప్తులు చాలా మంది తమ పార్టీలోకి వస్తామని అడుగుతున్నారని వెల్లడించారు. అవకాశం ఉన్న చోట వారిని చేర్చుకునే అంశంను పరిశీలిస్తామని సజ్జల స్పష్టం చేసారు. గోదావరి జిల్లాల్లో ప్రధానంగా రెండు పార్టీల్లోనూ అసంతృప్త నేతలు వైసీపీలో టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. అందులో ప్రజల్లో బలం ఉన్న వారెవరు..వారికి మద్దతు గా ఉన్న ఓట్ బ్యాంక్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలనేది కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 3వ తేదీ సిద్దం సభ తరువాత పార్టీలో చేరికలు ఉంటాయని తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు వైసీపీలో చేరికల అంశం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications