రూ. 21వేల వేతనంకు ఓకే: మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించాలంటూ మంత్రి సురేష్
అమరావతి: మున్సిపల్ కార్మికుల డిమాండ్ల విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు. మున్సిపల్ కార్మికుల హెల్త్ అలవెన్సులు యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్మికుల సమ్మెపై సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రివర్గ ఉపసంఘంలోని మంత్రులు అప్పలరాజు, నాగార్జున, బొత్స సత్యనారాయణ, సురేష్, వేణుగోపాలకృష్ణ, బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల హాజరై.. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
అనంతరం ముఖ్యమంత్రి జగన్ ను కలిసి.. మున్సిపల్ కార్మికుల డిమాండ్లపై చర్చించారు. కార్మికుల హెల్త్ అలవెన్సు 6 వేల రూపాయలు అలాగే ఉంచాలని సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి సురేష్ తెలిపారు. హెల్త్ అలవెన్సుతో కలిపి వేతనం 21 వేలు ఇవ్వాలని సీఎం జగన్ సూచించారని, మిగతా డిమాండ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి సురేష్ వెల్లడించారు.
ప్రధాన డిమాండ్లు పరిష్కరించిన నేపథ్యంలో సమ్మె విరమించాలని మంత్రి సురేష్ కార్మికులను కోరారు. అంతకుముందు రాష్ట్రంలోని పురపాలిక సంఘాల కమిషనర్లతో మంత్రి ఆదిమూలపు సురేశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మె అనంతర పరిస్థితులపై మంత్రి సురేశ్ ఆరా తీశారు.
సమ్మె నేపథ్యంలో చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు, ఎక్కడెక్కడ ఎంతమంది పారిశుద్ధ్య నిర్వహణకు హాజరవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. చెత్త పేరుకుపోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మంత్రి సూచించారు. అవసరమైన చోట ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా పనులు చేపట్టి చెత్తను తొలగించాలని ఆదేశించారు. ఇది ఇలావుండగా, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె నాల్గో రోజూ ఉద్ధృతంగా సాగింది. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.