ఏపీలో ఇసుక రాజకీయం ... చంద్రబాబు ఇసుక దీక్ష వర్సెస్ ఇసుక వారోత్సవాలు
రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను నిరసిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇసుక దీక్ష చేపట్టారు. ఇటీవల ఇసుక కోసం, భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విశాఖ వేదికగా పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహిస్తే, నేడు టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇసుక కోసం దీక్ష చేపట్టారు. ఇక ఇదే సమయంలో నేటి నుండి ఏపీ ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తుంది.

నేడే చంద్రబాబు ఇసుక దీక్ష
విజయవాడ అలంకార్ సెంటర్ కు సమీపంలోని ధర్నాచౌక్ లో చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష రాత్రి 8 గంటల వరకు సాగనుంది. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్యను నివారించాలని, ప్రజలకు ఉచితంగా అందించాలని పనులు లేక ఇబ్బందిపడుతున్న నిర్మాణ కార్మికులకు నెలకు పదివేల రూపాయల చొప్పున పరిహారం అందించాలని, అలాగే ఆత్మహత్యలకు పాల్పడిన కార్మికుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ తో చంద్రబాబు ఇసుక దీక్ష నిర్వహించనున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక తీవ్రంగా ఇసుక సమస్య
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు నెలలుగా తీవ్రమైన ఇసుక కొరత ఏపీలో నెలకొంది. ఇసుక లేక, నిర్మాణ రంగ కార్మికులకు పనులు లేక, జీవనం సాగించడం కష్టమై కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న వాదన ఎక్కువగా వినిపిస్తుంది. ఇక ప్రతిపక్ష పార్టీల నాయకులు అధికార వైసీపీపై పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇసుక కొరతను ఆయుధంగా తీసుకొని విరుచుకుపడుతున్నారు.

చంద్రబాబు ఇసుక దీక్షకు ప్రతిపక్షాల మద్దతు
నేడు టిడిపి అధినేత చంద్రబాబు తలపెట్టిన ఇసుక దీక్షకు పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు హాజరుకానున్నారు ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆయా పార్టీల ముఖ్యనేతలు చంద్రబాబుకు సంఘీభావం తెలపనున్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు, ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు .

నేటి నుండి ఇసుక వారోత్సవాలు నిర్వహించనున్న ప్రభుత్వం
ఇక ఇదే సమయంలో ఏపీ లో ఇసుక కొరత ని సీరియస్ గా తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇసుక కొరతను నివారించటం కోసం నేటి నుండి ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 14 నుండి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించి ప్రజలకు ఇసుక అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీరే వరకు అధికారులు సెలవులు కూడా తీసుకోవద్దని ఆయన తెలిపారు.

ఇసుక కోసం రంగంలోకి దిగనున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
వరదల వలన ఇసుక ఇబ్బంది ఏర్పడిందని, అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న ఇసుక కొరత నివారించడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు రంగంలోకి దిగుతారని తెలిపారు. వారం రోజులపాటు పూర్తిగా ఈ అంశంపైనే దృష్టి పెట్టి అడిగిన వారికి అడిగినంత ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేసినా, నిర్ణయించిన దానికంటే అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications