ఢిల్లీలో శ్రీకృష్ణుడు - జగన్ ను వంచుతాం : 2019లో తప్పు చేశారు: ఏపీ బీజేపీ నేతల సంచలనం..!!
బీజేపీ నేత సత్యకుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అమరావతి గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించిన బీజేపీ నేతలు ముగింపు సభలో కీలక వ్యాఖ్యలు చేసారు. తుళ్లూరు బీజేపీ సభ నిర్వహించింది. ఎక్కడైనా ఒకటే రాజధాని ఉంటుందని.. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చెప్పారు. అమరావతి రాజధాని విషయంలో బీజేపీ ఎంతో చిత్తశుద్ధితో ఉందని చెప్పుకొచ్చారు.
శిశుపాలుడి శిరచ్చేధనం తప్పదు
బీజేపీ పైన విశ్వాసం ఉంచాలని కోరారు. శ్రీకృష్ణుడు కూడా శిశుపాలుడికి శిరచ్ఛేదనం చేయడానికి వంద తప్పులు చేసేదాక ఆగక తప్పలేదని వ్యాఖ్యానించారు. అభినవ శిశుపాలుడి పాపాల చిట్టా పెరుగుతోందన్నారు. ఢిల్లీలోని శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కటీ లెక్కేసుకుంటున్నాడని చెప్పారు. వంద తప్పులకు చేరిన రోజు ఆ శ్రీకృష్ణుడు ఈ అభినవ శిశుపాలుడికి శిరచ్ఛేదనం చేయకుండా వదిలే ప్రసక్తే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కొన్ని నెలల్లోనే ఇది జరుగుతుందని..బీజేపీ కార్యకర్తగా చెబుతున్నానంటూ సత్య కుమార్ వ్యాఖ్యానించారు.
ఈ వేడిలోనే జగన్ ను వంచుతాం
రాష్ట్రంలో వాతావరణం బాగా వేడెక్కుతోందని, ఈ వేడిలోనే జగన్ను వంచుతామని, ఆ తరువాత రాష్ట్రంలో చల్లని వాతావరణం వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ అమరావతి విషయంలో పూర్తి చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ఆయనకు చిత్తశుద్ధి ఉండబట్టే రాజధాని నిర్మాణానికి 2,500 కోట్లు మంజూరు చేశారన్నారు.అమరావతికి మోదీ, అమిత్ షా, నడ్డా ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. బీజేపీ నాయకుల్లో ఎవరైనా భిన్నంగా మాట్లాడి ఉంటే అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలుగా భావించాలన్నారు. రాజధాని నిర్మాణ పనులు తక్షణం మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు.
2019 తప్పు మళ్లీ చేయద్దు
2019లో ప్రజలు తెలిసో తెలియక తప్పు చేశారని, 2024లో గనుక తప్పు చేస్తే రాష్ట్రాన్ని, ప్రజలను ఆ దేవుడు కూడా కాపాడలేడని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి హెచ్చరించారు. అమరావతి రాజధానిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అమరావతిని కాపాడుకోవాలంటే జగన్ను గద్దె దించాలని ఆదినారాయణరెడ్డి సూచించారు. ఏపీలో బీజేపీకి సీట్లు రాకపోయినా.. మోదీ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారని తెలిపారు. జగన్ ఏం చేసినా అమరావతి నుంచి రాజధాని మార్చలేరని సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నిజమైన నాయకుడు అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తాడని పేర్కొన్నారు.