విశాఖపట్నం- విజయవాడ రైలు ప్రయాణికులకు పండగ శుభవార్త
Special Trains: దేశం మొత్తం దీపావళి పండగ కోలాహలం నెలకొంది. ప్రజలు ఈ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటోన్నారు. అన్ని రాష్ట్రాలు పండగ శోభను సంతరించుకున్నాయి. కార్తీకమాసారంభం నేపథ్యంలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఈ సందర్భంగా రైళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. ప్రయాణికుల తాకిడి ఏర్పడింది. రైల్వే స్టేషన్లన్నీ కూడా పోటెత్తుతున్నాయి. రద్దీ విపరీతంగా ఉంటోంది. పండగ సీజన్, వారాంతంలో వచ్చిన వరుస సెలవులు, కార్తీకమాసంలో శైవక్షేత్రాలను దర్శించుకునే భక్తుల తాకిడిని నివారించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్పెషల్ రైళ్లను నడిపిస్తోన్నారు.

ఇందులో భాగంగా విశాఖపట్నం- విజయవాడ మధ్య 16 జన్సాధారణ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్ల హాల్ట్ స్టేషన్లు, టైమ్ టేబుల్ వివరాలను వెల్లడిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికుల రద్దీని నివారించడానికి ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.
1, 3, 4, 6, 8, 10, 11, 13 తేదీల్లో ఉదయం 10 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరే నంబర్ 08567 రైలు అదే రోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. అవే తేదీల్లో సాయంత్రం 6:30 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరే నంబర్ 08568 రైలు అర్ధరాత్రి 12:35 నిమిషాలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది.
దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 13వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని, వాటిని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ రైళ్లల్లో ప్రయాణించడానికి ఎలాంటి రిజర్వేషన్ అవసరం ఉండదు.












Click it and Unblock the Notifications