నారాయణ బెయిల్ రద్దు కోరిన జగన్ సర్కార్- మీ రాజకీయాల్లోకి లాగొద్దన్న సుప్రీంకోర్టు
ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన నారాయణకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్ కు చుక్కెదురైంది. నారాయణ బెయిల్ ను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఈ వినతిని తోసిపుచ్చింది. అంతేకాదు ప్రతీకార రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణపై సీఐడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. నారాయణ పిటిషన్ విచారించిన హైకోర్టు.. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టులో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. ఈ సందర్భంగా మున్సిపల్ మంత్రిగా నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వం వాదించింది.
హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చే సమయంలో తాము అభ్యంతరం తెలిపామని, మంత్రిగా ఉంటూ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ విషయంలో అలైన్ మెంట్లు మార్చి పలు అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దంటూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుడైన మాజీ మంత్రి విచారణకు సహకరించకపోతే అప్పుడు కోర్టుల్ని ఆశ్రయించమంటూ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను తోసిపుచ్చింది.