సుప్రీంకోర్టుకే షాకిచ్చిన నెల్లూరు జడ్డి- బెయిల్ ఇచ్చినా రెండేళ్లు జైల్లోనే ఖైదీ-కోర్టు తీవ్ర ఆగ్రహం
ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ బెయిల్ ఆదేశాన్ని జిల్లాలోని ఓ అదనపు సెషన్స్ జడ్జి అపార్ధం చేసుకున్నారు. సుప్రీం బెయిల్ ఇమ్మంటే ఇవ్వొద్దని చెప్పినట్లు ఆదేశాల్ని అపార్ధం చేసుకున్నారు. దీంతో సదరు బాధితుడికి బెయిల్ ఇవ్వలేదు. ఈ విషయం తెలిసి సుప్రీంకోర్టే షాక్ అయింది. చివరికి ఆ జడ్జికి ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
నెల్లూరు జడ్డిపై సుప్రీం ఫైర్
నెల్లూరు జిల్లాలో ఓ అదనపు సెషన్స్ జడ్డి తీసుకున్న నిర్ణయం ఓ బెయిల్ లభించిన ఖైదీకి ఏడాదిన్నరపైగా జైల్లోనే ఉండేలా చేసింది. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా దాన్ని అపార్ధం చేసుకున్న జడ్డి సదరు ఖైదీకి మోక్షం ప్రసాదించలేదు. దీంతో సదరు ఖైదీ దాదాపు రెండేళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. విషయం తెలిసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని పోలీసులతో పాటు జైలు అధికారుల్నూ కోరింది.
ఎవరా పెద్దమనిషని సుప్రీం ప్రశ్న
తాము బెయిల్ ఇచ్చినా ఖైదీని విడుదల చేయకుండా జైల్లోనే ఉంచిన జడ్జి తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నెల్లూరు జడ్డిని ఉద్దేశించి ఎవరా పెద్దమనిషంటూ ప్రశ్నించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్.. తమ ఉత్తర్వుల్ని అపార్ధం చేసుకోవడాన్ని బట్టి చూస్తుంటే ఆయనకు జ్యుడిషియల్ అకాడమీలో ఎలాంటి శిక్షణ ఇచ్చారో అర్ధం కావడం లేదన్నారు. ఆ పెద్ద మనిషి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నామని లలిత్ తెలిపారు. తాము బెయిల్ ఇచ్చినా బాధితుడు రెండేళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి రావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ న్యాయాధికారి వైఖరి చూస్తుంటే సుప్రీంకోర్టు జడ్డిలకే శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే?
భార్యను గృహహింస చేసి హత్య చేసిన కేసులో నెల్లూరు సెంట్రలో జైల్లో 9 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న హరికృష్ణ అనే వ్యక్తి బెయిల్ పిటిషన్ విచారణ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2020 సెప్టెంబర్ 28న బెయిల్ ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులు నెల్లూరు అదనపు సెషన్స్ జడ్డికి కూడా చేరాయి. వాటిని అపార్ధం చేసుకున్న జడ్జి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వొద్దని చెప్పినట్లు భావించి బెయిల్ మంజూరు చేయలేదు. చివరికి నెల్లూరు జడ్డి ఆదేశాలతో తాజాగా గతనెలలో సదరు బాధితుడిని సెంట్రల్ జైలు అధికారులు విడుదల చేశారు.
అయితే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వాలని చెప్పిన తర్వాత బాధితుడు ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. మూడు రోజుల పాటు అతన్ని కోర్టులో హాజరు పర్చలేదు. దీంతో ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో అతను రెండేళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది.