అయ్యప్పమాల వేశాడని స్కూల్ నుంచి వెళ్లగొట్టారు, రైస్ పుల్లింగ్ చెంబు పట్టివేత
అనంతపురం/నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ పాఠశాలలో మతసామరస్యాన్ని అపహాస్యం చేశారు. కొండాయపాలెం గేటు సమీపంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో అయ్యప్పమాల ధరించిన ఐదో తరగతి విద్యార్థినిని ఉపాధ్యాయురాలు ఇంటికి పంపించింది. పాఠశాల ఎదుట బంధువులు ఆందోళన చేశారు.
రైస్ పుల్లింగ్ చెంబు పట్టివేత
గుప్త నిధుల తవ్వకాలలో ఉపయోగించే రైస్ పుల్లింగ్ చెంబును విక్రయిస్తున్న ఏడుగురిని పోలీసులు గురువారం నాడు అరెస్టు చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని తలుపుల మండలంలో జరిగింది.
మండలంలోని రాజనోలపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ తన వద్ద ఉన్న రైస్ పుల్లింగ్ చెంబును కర్నాటకలోని సిడ్లగట్లపల్లెకు చెందిన ఆరుగురికి మండల పరిధిలోని జోతివాండ్లపల్లి సమీపంలో విక్రయించే ప్రయత్నం చేశాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రైస్ పుల్లింగ్ చెంబును రూ.4.20 లక్షలకు విక్రయించేందుకు బేరం చేస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఏడుగురిని అరెస్టు చేశారు. వీరితో పాటు రైస్ పుల్లింగ్ చెబును, రూ.4.20 లక్షల నగదు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు
తూర్పు అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడుతోందని వాతావరణ విభాగం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.