Vandebharat: సికింద్రాబాద్ - తిరుపతి రైలు నెంబర్ ఇదే : షెడ్యూల్ ఇలా..!!
తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ పట్టాలెక్కుతోంది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ప్రారంభం కానుంది. ప్రారంభం రోజున ప్రయాణీకులను అనుమతించరు. 9వ తేదీన తిరుపతి నుంచి ఈ రైలు ప్రారంభం అవుతుంది. 10వ తేదీ నుంచి రెగ్యులర్ గా ఈ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయి. తాజాగా ఈ రైలు నెంబర్ ను అధికారులు ఖరారు చేసారు. స్టేషన్లు.షెడ్యూల్ ప్రకటించారు. టికెట్ ధరల ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మంగళవారం మినహా వారంలో మిగిలిన అన్ని రోజులు వందేభారత్ సికింద్రాబాద్ - తిరుపతి- సికింద్రాబాద్ మధ్య పరుగులు తీయనుంది.
పూర్తయిన ట్రయిల్ రన్..
నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే తిరుపతికి వందేభారత్ అందుబాటులోకి వస్తోంది. వందేభారత్ ద్వారా ఇప్పటి వరకు ఈ మార్గంలో దాదాపు 12 గంటలుగా ఉన్న ప్రయాణం ఇక నుంచి 8.30 గంటల్లోనే పూర్తి కానుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తున్న నారాయణాద్రి రూటులోనూ ఈ రైలు రాకపోకలు సాగించనుంది. దీనికి వీలుగా ఈ రూట్ లో ట్రయిల్ రన్ నిర్వహించారు.
గంటకు 130 కిలో మీటర్ల వేగం వరకు వందేభారత్ ప్రయాణం చేసేందుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మార్గంలో ఇతర రైళ్లకు అంతరాయం లేకుండా.. అదే సమయంలో వందేభారత్ రైలుకు ఎక్కడా క్రాసింగ్ సమస్య లేకుండా షెడ్యూల్ ను ఖరారు చేసారు.

రైలు నెంబర్ ఖరారు..
సికింద్రాబాద్ - తిరుపతి - సికింద్రాబాద్ వందేభారత్ రైలు నెంబరు ఖరారు అయింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ కు నెంబర్ 20701 గా ఖరారు కాగా, అదే విధంగా తిరుపతి నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే రైలుకు నెంబర్ 20702 గా ఖరారు చేసారు. ఇదే సమయంలో టికెట్ ధరలకు సంబంధించి తుది కసరత్తు జరుగుతోంది. ఈ రోజు లేదా రేపు టికెట్ ధరలు ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ధర రూ. 2వేలు పైగా ఉండే అవకాశం ఉంది.
ఏసీ చైర్ కారు రూ. 1150గా ఉంటుందని సమాచారం. ఏడు ఛైర్ కార్, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ తో మొత్తం ఎనిమిది కోచ్ లతో ఈ రైలు ప్రస్తుతం కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ప్రయాణీకుల నుంచి ఆదరణ..ఫీడ్ బ్యాక్ పరిగణలోకి తీసుకొని కోచ్ లు పెంపు సంఖ్య పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ రైలు ప్రయాణ సమయం 8 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేసారు.
వందేభారత్ షెడ్యూల్ ఇలా..
సికింద్రాబాద్ - తిరుపతి-తిరుపతి మధ్య వందేభారత్ షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ లో బయల్దేరి నల్గొండ కు 07.19కి, గుంటూరుకు 9.45, ఒంగోలుకు 11.09, నెల్లూరుకు 12.29 చేరుకొని..అక్కడ నుంచి మధ్నాహ్నం తిరుపతికి 14.30 చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో భాగంగా.. తిరుపతిలో మధ్నాహ్నం 15.15కి బయల్దేరి..నెల్లూరుకు సాయంత్రం 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండకు 22.10, సికింద్రాబాద్ కు రాత్రి 23.45కి చేరుకుంటుంది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య కేవలం నాలుగు స్టేషన్లకు మాత్రమే హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ - పూణే, కాచిగూడ - బెంగళూరు మధ్య త్వరలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications