ఘోర అవమానం: సీఎం పొటోను డస్ట్బిన్గా వాడేశారు, ఎవరో కాదు..!
ఆంధ్రప్రదేశ్ సచివాలయం సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగులు సీఎం చంద్రబాబునాయుడును ఘోర పరాభవానికి గురిచేశారు. ప్రభుత్వాధినేత ఫొటో పట్ల ఉద్యోగులు వ్యవహరించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగులు సీఎం చంద్రబాబునాయుడును ఘోర పరాభవానికి గురిచేశారు. ప్రభుత్వాధినేత ఫొటో పట్ల ఉద్యోగులు వ్యవహరించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. సచివాలయంలో ఫ్రేమ్ కట్టి ఉన్న సీఎం చంద్రబాబు ఫోటోను డస్ట్బిన్ లాగా వాడుకోవడం విమర్శలకు తావిచ్చింది.
డస్ట్ బిన్గా..
ఉద్యోగుల తీరు గమనించినట్లయితే.. చిరుపదార్ధాలు తిన్న ప్లేట్లను సీఎం ఫోటోపై పెట్టి వెళ్లారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్లు సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. సోమవారం సచివాలయంలోని నాలుగో బ్లాక్లో ఉన్నత విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తినడానికి వారికి చిరుపదార్థాలు ఏర్పాటుచేశారు. అంతా అయిపోయాక. ఆ చెత్తను, ప్లేట్లను సీఎం చంద్రబాబు ఫోటోపై పెట్టి వెళ్లడం గమనార్హం.
టీపాయ్లా వాడేశారు..
సచివాలయంలోని నాలుగో ఫ్లోర్లో గల సమావేశ మందిరంలో సీఎం చంద్రబాబు ఫోటోతో పాటు కొంతమంది దేవుళ్ల ఫోటోలు అక్కడ ఉన్నాయి. వాటిని గోడకు తగిలించలేదు. టేబుల్పైనే పెట్టారు. కాగా, సోమవారం సమావేశ మందిరంలో సమీక్ష జరిపిన విద్యాశాఖ అధికారులు చిరుతిళ్లు తెప్పించుకున్నారు. వాటిని పేపర్ ప్లేట్లలో అధికారులకు పంపిణీ చేశారు. అయితే ప్లేట్లను సప్లయ్ చేయడానికి టీ పాయ్ దొరకకపోవడంతో ఫ్రేమ్ కట్టి ఉన్న సీఎం ఫోటోని టీ పాయ్లాగా వాడుకున్నారు.
అంతేగాక..
తిన్న తరువాత ఆ ప్లేట్లను సీఎం ఫోటోపైనే వదిలిపెట్టి వెళ్లిపోవడం గమనార్హం. నిజానికి సచివాలయంలో ప్రతీ విభాగంలో ప్రభుత్వాధినేత ఫోటో ఉంటుంది. సమావేశ మందిరాల్లోనూ ఏర్పాటుచేస్తారు. అదేవిధంగా నాలుగో బ్లాక్లో ఉన్న సమావేశ మందిరంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో పెట్టాలని అధికారులు తీసుకువచ్చారు. కానీ, గోడకు తగిలించే విషయంలో నిర్లక్ష్యం చూపారు. దీంతో కొద్దిరోజులుగా సీఎం ఫోటో సమావేశ మందిరంలో టేబుల్పైనే ఉంటోంది. ఇప్పుడు సచివాలయ అధికారులు ఈ ఫోటోను డస్ట్బిన్లా వాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.
పెద్ద అధికారుల తప్పిదమే... చర్యలకు డిమాండ్..
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఫొటోనే అధికారులు ఇలా ఉపయోగించడం చూస్తుంటే.. వారు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఇది ఏదో చిన్నచిన్న అధికారులు చేసిన తప్పిదం కాదు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మరో అధికారి పాండా దాస్, జేఎన్టీయూ అధికారులతో జరిపిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ విషయం తెలిసిన అధికార వర్గాలు, టీడీపీ శ్రేణలు భగ్గుమంటున్నాయి. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.