హైద్రాబాద్పై డిమాండ్స్: కేంద్రమంత్రుల 16పేజీల రిపోర్ట్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల బృందం(జివోఎం)కు ఇచ్చేందుకు పదహారు పేజీలతో కూడిన నివేదికను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు సిద్ధం చేశారు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అపాయింటుమెంటును కోరామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతామని సీమాంధ్ర కేంద్రమంత్రులు చెప్పారు.
పలువురు మంతద్రులు, ఎంపీలు కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు నివాసంలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో జీవోఎం నివేదిక, అఖిలపక్షం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు అంగీకరిస్తే రాయల తెలంగాణకు అభ్యంతరం లేదని సీమాంధ్ర కేంద్రమంత్రులు ఆ నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, ఐఐటి, ఐఐఎం మంజూరు చేయాలని, విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ఎయిర్ పోర్టుగా తీర్చి దిద్దాలని, గుంటూరు-విజయవాడ మధ్య రాజధానిని నిర్మించాలని, కొత్త రాజధాని నిర్మాణానికి భారీ ప్యాకేజీ ఇవ్వాలని మంత్రులు ఆ నివేదికలో పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని, కృష్ణా డెల్టాకు ముందే నీటి కేటాయింపులు ఉండాలని, పులిచింతల, పొలవరం ప్రాజెక్టులను పూర్తి చేయాలని, ఆర్టికల్ 371 (డి)ని కొనసాగించాలని మంత్రుల బృందం నివేదికలో పేర్కొంది.
మూడు ప్రాంతాల్లో ఐటిఐఆర్, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో లభించే గ్యాస్ను రాష్ట్రంలోని ప్రాజెక్టులకే కేటాయించాలని, హైదరాబాద్ ఆదాయాన్ని జనాభా నిష్పత్తిలో పంచాలని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, జెడి శీలం, పళ్లం రాజు హాజరయ్యారు.