పంపండి: సీమాంధ్ర టిడిపి, జెసికి కెటిఆర్ 'గద్వాల్' ఆఫర్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపించాలని తాము మొదటి నుండి డిమాండ్ చేస్తున్నామని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు దూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమామహేశ్వర రావులు సోమవారం అన్నారు. శాసన సభ వాయిదా పడిన అనంతరం వారు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బిల్లుపై ఓటింగ్ జరపాలని, దానిని తిప్పి పంపించాలన్నారు. కిరణ్ ఇచ్చిన నోటీసును సభ ముందుకు తేవాలని డిమాండ్ చేశారు.
సిఎం ఇచ్చిన నోటీసు పైన అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోను సమైక్యంగానే ఉంటుందన్నారు. బిల్లు తప్పుల తడక అని తాము చెబుతూనే ఉన్నామన్నారు. సమైక్యం ముసుగులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ 'సోనియావాదం' వినిపిస్తున్నారన్నారు. ఓట్లు, సీట్ల కోసం విభజన చేస్తున్నారని, టిడిపి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేస్తే, కాంగ్రెసు దివాళాంధ్ర ప్రదేశ్ చేశాయన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు అసమగ్రంగా ఉందని, దానిని తిప్పి పంపించాలని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభాపతిని కలిసి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కిరణ్ నోటీసు చెల్లదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. సహచర మంత్రులను పరిగణలోకి తీసుకోని కిరణ్ తనను తాను సిఎంగా భావించడం సిగ్గుచేటు అన్నారు.
శాసన మండలి వాయిదా
తెలంగాణ బిల్లును తిప్పి పంపించాలని సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్సీలు, మంత్రి రామచంద్రయ్య ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు సోమవారం ఉదయం శాసన మండలిలో నినాదాలు చేశారు. దీంతో మండలిని చైర్మన్ చక్రపాణి వాయిదా వేశారు. టి మంత్రులు మండలి చైర్మన్ను కలిసి రామచంద్రయ్య ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని కోరారు.
జెసికి కెటిఆర్ ఆఫర్
అసెంబ్లీ లాబీల్లో జెసి దివాకర్ రెడ్డి, కెటిఆర్ మధ్య ఆసక్తికర చర్చ సాగింది. వారు లాబీల్లో ఎదురు పడ్డప్పుడు.. జెసి మాట్లాడుతూ.. తమ మూలాలు గద్వాల్లోనే ఉన్నాయన్నారు. దానికి స్పందించిన కెటిఆర్... గద్వాల నుండి తెరాస అభ్యర్థిగా పోటీ చేయాలని ఆఫర్ చేశారు. మీరు రాజ్యసభకు పోటీ చేస్తున్నందున ఢిల్లీకి వెళ్తే మీ అబ్బాయిని అయినా పోటీ చేయించండన్నారు. అందుకు జెసి స్పందిస్తూ.. కాంగ్రెస్, తెరాస ఒక్కటేనన్నారు.