ఏపీలో ఆ పార్టీకి 90 నుంచి 100 సీట్లు.. జిల్లాలవారీగా లెక్కలు ఇవే
హోరాహోరీగా జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాలు మరో మూడురోజుల్లో వెల్లడికానున్నాయి. రాజకీయ నాయకులతోపాటు ప్రజలు కూడా మునివేళ్లపై ఉత్కంఠతో నిలబడివున్నారు. ఈ క్రమంలో కొందరు సెఫాలజిస్టులు, కొందరు సీనియర్ రాజకీయవేత్తలు, కొన్ని సంస్థలు ఎవరికివారుగా సొంత సర్వే అంటూ ఫలితాలను ప్రకటించాయి. ప్రకటిస్తున్నాయి. తాజాగా కడప జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి రానున్న ఏపీ ఫలితాలపై తన అంచనాలను వెల్లడించారు.
ఆ నాలుగు జిల్లాల్లో వైసీపీ కష్టమే
ఏపీ రాజకీయాలు 2023 నుంచి పూర్తిగా మారిపోయాయని మైసూరారెడ్డి అన్నారు. టీడీపీ, జనసేన కలవడంవల్ల వైసీపీ గ్రాఫ్ తగ్గిందన్నారు. ఈ రెండు పార్టీలకు బీజేపీ కూడా కలిసిందని, ఆ పార్టీవల్ల పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ కేవలం 0.5 శాతం నుంచి ఒక శాతం మాత్రమే ఉంటుందన్నారు. టీడీపీ-జనసేన కలవడం అనేది రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో పెద్ద ప్రభావమే చూపిందన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గంటూరు జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చెరుసగం పంచుకోవచ్చన్నారు.

ఎక్కడా లేని మద్యం ధరలు ఏపీలోనే
శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు కూటమికి అనుకూలంగా ఉన్నాయని, విజయనగరం వైసీపీకి అనుకూలంగా ఉందన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 100 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనపడుతోందన్నారు. మొత్తంగా కూటమి 90 నుంచి 100 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు మైసూరారెడ్డి విశ్లేషించారు. మద్యంపై ఎక్కడా లేని ధరలు ఏపీలోనే ఉన్నాయన్నారు. సంక్షేమం తీసుకునేవారి కుటుంబాల్లో కూడా మద్యం తాగేవారు ఉన్నారని, ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాగేసుకున్నారనే భావనలో వారంతా ఉన్నారన్నారు. గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు, పింఛను జులైలో రూ.7వేలు ఇస్తామని చెప్పడంలాంటివి కూడా రూరల్ ప్రాంతాల్లోని ప్రజలను కూటమివైపు మొగ్గేలా చేసివుంటాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications