పింఛన్ల వ్యవహారం బూమరాంగ్: సీఎస్తో టీడీపీ నేతల అత్యవసర భేటీ
Chandrababu Naidu: రాష్ట్రంలో చేపట్టాల్సిన పింఛన్ల పంపిణీపై తెలుగుదేశం పార్టీ నాయకులు యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. వలంటీర్ల ద్వారానే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం, దీనికోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాష్ట్రంలో వలంటీర్ల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ- లోక్సభ ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో వలంటీర్ల ద్వారా పింఛన్లను ఇంటింటికీ పంపిణీ చేయడం సరికాదని పేర్కొన్నారు.

దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు సానుకూలంగా స్పందించారు. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆప్తుడు అనే పేరుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్కు. చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన అధికారి కావడం దీనికి ఓ కారణంగా చెబుతున్నారు.
ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. వలంటీర్లకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్లను పంపిణీ చేయాలని సూచించారు. లబ్దిదారులకు సకాలంలో పింఛన్ మొత్తాలు అందేలా గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు, క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు.

తాజాగా మరోసారి టీడీపీ నాయకులు జవహర్ రెడ్డిని కలిశారు. ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు పింఛన్లను అందించేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయాలకు బదులుగా లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లాలని కోరారు. దీనికోసం గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించారు.
జవహర్ రెడ్డిని కలిసిన వారిలో మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమా మహేశ్వరరావు, కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ పొలిట్బ్యురో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఉన్నారు. శాశ్వత ప్రాతిపదికన పని చేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగులను ఎక్కడ అవసరమైతే అక్కడ వినియోగించుకునే వెసలుబాటు ఉందని అన్నారు. ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణ కోసం వారి సేవలనే వాడుకుంటుంటుందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications