పార్టీకి వెన్నుదన్నుగా ఉంటోన్న ఆ వర్గానికి వైఎస్ జగన్ నజరానా - కీలక ప్రకటన
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. జిల్లాల పర్యటనలతో జనం మధ్యే ఉంటోన్నారాయన. బహిరంగ సభలను నిర్వహిస్తోన్నారు. ప్రజల సమక్షంలోనే సంక్షేమ పథకాల లబ్దిని విడుదల చేస్తోన్నారు. ప్రభుత్వం చేస్తోన్న కార్యక్రమాలు, అమలులో ఉన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే- ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలను సంధిస్తోన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై చురకలు అంటిస్తోన్నారు.
వర్క్షాప్లతో..
2024 సార్వత్రిక ఎన్నికలను వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున దానికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు. ఈ నేపథ్యంలో- వైఎస్ జగన్ అటు పార్టీపరంగానూ పలు కీలక నిర్ణయాలతో దూసుకెళ్తోన్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడానికి వర్క్షాప్లనూ ఏర్పాటు చేస్తోన్నారు.
బీసీ నేతలతో..
పార్టీకి వెన్నుదన్నుగా ఉంటోన్న వెనుకబడిన సామాజిక వర్గంపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. బీసీలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడానికి వెనుకాడట్లేదు. వారి కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశాలను వైఎస్ జగన్ పరిశీలిస్తోన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని భావిస్తోన్నారు వైఎస్ జగన్. 2019 ఎన్నికల్లో బీసీలందరూ గంపగుత్తగా ఓటు వేయడం వల్లే 151 అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుందనేది బహిరంగ రహస్యమే.
మరింత బలోపేతం..
2024 నాటికి కూడా ఇదే ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవడంపై వైసీపీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇదివరకెప్పుడూ లేని విధంగా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. బీసీల కోసం ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడానికి సమాయాత్తమౌతోంది. డిసెంబర్ 8వ తేదీన విజయవాడలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది.
హాజరయ్యేది వీరే..
ఈ ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్రంలోని బీసీ సర్చంచులు, జడ్పీటీసీలు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఆలయ కమిటీ ప్రతినిధులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు.. దీనికి హాజరవుతారు. వైెస్ జగన్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ ఆత్మీ సమ్మేళనం సందర్భంగా బీసీల కోసం కొన్ని నజరానాలను ప్రకటించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నా
సాయిరెడ్డి అధ్యక్షతన..
దీనికి సంబంధించిన ప్రాథమిక నిర్ణయాలను వైసీపీ అగ్ర నాయకత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ ఉదయం పార్టీకి చెందిన సీనియర్ బీసీ నాయకులు హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి దీనికి అధ్యక్షత వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, శాసన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, కొలసు పార్థసారథి, మాజీ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.