రఘురామ మరో డిమాండ్ కు మోక్షం-జగన్ నో-కేంద్రం సై-మధ్యలో టీడీపీకి ఊరట
వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగుతున్న పోరులో పైచేయి సాధించడం కోసం ఇరువర్గాలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో గతంలో రఘురామరాజు సీఎం జగన్ కు రాసిన లేఖలో ప్రస్తావించిన ఓ కీలక సమస్యకు పరిష్కారం లభించబోతోంది. దీంతో పదో తరగతి పరీక్షల రద్దు తర్వాత మరో అంశంలో రఘురామ రాజు తన డిమాండ్ నెరవేర్చుకున్నట్లవుతోంది. అదే సమయంలో ఈ వ్యవహారంలో బాధిత పార్టీగా ఉన్న టీడీపీకి కూడా ఊరట దక్కబోతోంది. వివరాల్లోకి వెళితే....
రఘురామ లేఖకు స్పందన అలా
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరిస్తున్న విధానాలపై నిత్యం సీఎం జగన్ కు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖలు రాస్తున్నారు. ఇందులో పలు ప్రజా ప్రయోజన అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. స్పందనతో సంబంధం లేకుండా అధికార పార్టీ అధినేత కమ్ సీఎంగా ఉన్న జగన్ కు రఘురామ రాస్తున్న లేఖల్లో ప్రస్తావిస్తున్న అంశాలు చర్చనీయాంశమవుతువుతున్నాయి.
వీటిపై ప్రభుత్వం మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తోంది. వీటికి స్పందిస్తే ఎక్కడ రఘురామకు మైలేజ్ వస్తుందో అన్న భావనతో రఘురామ లేఖల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కానీ తాజాగా రఘురామ కూడా ఊహించని విధంగా ఆయన రాసిన ఓ లేఖలోని సమస్యకు జగన్ ప్రభుత్వం స్పందించాల్సిన పరిస్దితి వచ్చింది.
రఘురామ మరో డిమాండ్ నెరవేరుతుందిలా..
ఏపీలో పైసీపీ సర్కార్ గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై సీఐడీతో కేసులు పెట్టిస్తోంది. ఇందులో సెక్షన్ 66ఏ కేసులు కూడా ఉన్నాయి. ఇలా జగన్ హయాంలో పెట్టిన కేసులతో పాటు గతంలో చంద్రబాబు హయాంలో పెట్టిన కేసులతో కలిపి 38 కేసులున్నాయి. కానీ సుప్రీంకోర్టు 2015లోనే సోషల్ మీడియా పోస్టులపై సెక్షన్ 66ఏ ప్రయోగించవద్దంటూ రద్దు చేసేసింది.
అయినా చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు ఆ సెక్షన్ల కింద కేసులు పెట్టాయి వీటి ఉపసంహరణ కోరుతూ రఘురామ లేఖ రాసినా జగన్ స్పందించలేదు. కానీ తాజాగా సుప్రీంకోర్టు ఆగ్రహంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ కేసులు ఉపసంహరించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో రఘురామ డిమాండ్ నెరవేరుతోంది.
ఏపీలో సెక్షన్ 66ఏ కేసుల ఉపసంహరణ
ఏపీలో సెక్షన్ 66ఏ కింద నమోదు చేసిన కేసుల్ని ఎత్తేయాలంటూ కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు రావడంతో ఏపీ సర్కార్ ఆ దిశగా అడుగులేస్తోంది. ఇప్పటివరకూ నమోదైన 38 కేసుల్ని గుర్తించి, వెంటనే ఉపసంహరించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారుల్ని వివరాలు కోరినట్లు తెలుస్తోంది. ఈ వివరాలు రాగానే ప్రభుత్వం సెక్షన్ 66ఏ కేసుల్ని ఉపసంహరిస్తూ జీవో జారీ చేయనుంది. అదే జరిగితే ప్రభుత్వ విధానాలతో విభేదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కేసులు ఎదుర్కొంటున్న ఎంతో మందికి ఊరట లభించబోతోంది.
టీడీపీకి భారీ ఊరట
గతంలో వైసీపీ సర్కార్ విధానాలను విమర్సిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురిపై సెక్షన్ 66ఏ కింద కేసులు పెట్టడాన్ని రఘురామకృష్ణంరాజు తప్పుబట్టారు. వీటిని తక్షణం ఉపసంహరించాలని జగన్ కు లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కారం ఎదుర్కోవాల్సిన వస్తుందని కూడా హెచ్చరించారు.
ఇప్పుడు ఆ కేసుల్ని కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జగన్ సర్కార్ ఉపసంహరించుకోవాల్సిన పరిస్దితి ఎదురుకావడంతో రఘరామరాజుతో పాటు టీడీపీ వర్గాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా జగన్ సర్కార్ విధానాలను విమర్శిస్తూ పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులకు ఈ నిర్ణయంతో ఊరట దక్కబోతోంది.