జగన్ సర్కార్ కు సుప్రీం ఝలక్- కరోనా నిధులు పీడీ ఖాతాలకు మళ్లింపు-నిగ్గు తేల్చాలని కాగ్ కు ఆదేశం
ఏపీలో కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.1100 కోట్ల నిధుల్ని దారి మళ్లించిన వ్యవహారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. విపత్తు నిర్వహణ నిధి కింద చెల్లించాల్సిన ఈ నిధుల్ని ప్రభుత్వం పీడీ ఖాతాలకు మళ్లించినట్లు పిటిషనర్ ఆరోపించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపై ప్రభుత్వం నుంచి అలా జరగలేదని అఫిడవిట్ తీసుకుంది. అయితే దీనిపై నిజా నిజాలు తేల్చాలని కాగ్ ను ఆదేశించడం చర్చనీయాంశమవుతోంది.
కరోనా మృతుల కుటుంబాలకు సాయం
దేశవ్యాప్తంగా కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పిన సాయం చేయాలని గతంలో సుప్రీంకోర్టు కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చింది. అయితే దీన్ని చాలా ప్రభుత్వాలు అమలు చేయలేదు. ఇందులో ఏపీ కూడా ఉంది. విపత్తు నిర్వహణ నిధి కింద కరోనా మృతుల కుటుంబాలకు ఇలా చెల్లించాల్సిన రూ.1100 కోట్లు చెల్లించకపోవడంపై సుప్రీంకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఈ నిధులు పీడీ ఖాతాలకు మళ్లించి ఇతర అవసరాలకు వాడుకున్నారని టీడీపీ పిటిషన్లు వేసింది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
జగన్ సర్కార్ అఫిడవిట్
కరోనా మృతుల కుటుంబాలకు విపత్తు సహాయక నిధి నుంచి చెల్లించాల్సిన రూ.1100 కోట్లను చెల్లించకుండా ఇతర అవసరాల కోసం పీడీ ఖాతాలకు మళ్లించి వాడుకున్నారనే ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో విపత్తు సాయం కింద గతంలో కేంద్రం ఇచ్చిన నిధులకు మరికొంత జోడించి రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద చెల్లించినట్లు పేర్కొంది. ఇక్కడ కరోనా మృతులకు ఇవ్వాల్సిన సాయం మళ్లింపు జరగలేదని పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు తాజాగా విచారణ జరిపింది.
కాగ్ విచారణకు సుప్రీం ఆదేశం
కరోనా మృతుల కుటుంబాలకు విపత్తు సహాయక నిధి నుంచి చెల్లించాల్సిన రూ.1100కోట్లను పీడీ ఖాతాలకు మళ్లించి వాడుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు దాన్ని కాగ్ కు అప్పగించింది. దీనిపై విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలని కాగ్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలపై వాస్తవాలు నిర్ధారించేందుకు కాగ్ రంగంలోకి దిగబోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం విపత్తు నిధులు మళ్లించిందా లేక ఇతర నిధులు మళ్లించిందా అది కూడా నిబంధనల ప్రకారమే జరిగిందా లేదా అనేది కాగ్ నిగ్గు తేల్చబోతోంది.
ఇరుకునపడ్డ జగన్ సర్కార్
ఇప్పుడు కరోనా సాయానికి ఇవ్వాల్సిన విపత్తు నిధుల్ని పీడీ ఖాతాలకు మళ్లించారా లేదా అన్న దానిపై కాగ్ విచారణ జరపనుండటం ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారబోతోంది. ఎందుకంటే ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన నిధుల్ని పీడీ ఖాతాలకు మళ్లించి వాడుకోవడంపై ఇప్పటికే కాగ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కరోనా సాయానికి విపత్తు నిధులు వాడారా లేదా అన్న దానిపై కాగ్ ఇచ్చే నివేదిక కీలకంగా మారింది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా ఈ నిధుల మళ్లింపు వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు లేకపోలేదు.