నాగబాబుకు అడుగడుగునా షాక్ లు? రెండో రోజూ వర్మ ఫ్యాన్స్ చికాకు..!
ఏపీలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం టూర్ ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. పిఠాపురంలో గతంలో పల్లెపండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ శంఖుస్థాపన చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించేందుకు వెళ్లిన నాగబాబును టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ అభిమానులు అడుగడుగునా చికాకు పెడుతున్నారు. దీంతో ఆయనకు వరుస షాకులు తప్పడం లేదు.
తొలిసారి ఎమ్మెల్సీ హోదాలో పిఠాపురం పర్యటనకు వెళ్లిన నాగబాబుకు వర్మ అభిమానులు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో వర్మను ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహంగా ఉన్న ఆయన అభిమానులు ఇప్పుడు ఆయన టూర్ లో ఆ కోపం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాగబాబు ప్రారంభోత్సవాలు చేస్తున్న కార్యక్రమాలకు వెళ్తున్న వర్మ అభిమానులు.. అక్కడ ఆయన నినాదాలు చేస్తున్నారు. దీంతో జనసేన అభిమానులు కూడా ప్రతినినాదాలు చేస్తున్నారు.

ఇవాళ రెండోరోజు పిఠాపురం పర్యటనలో భాగంగా నాగబాబు పిఠాపురం మండలం కుమారపురం హౌసింగ్ లే అవుట్ -1లో 15.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనూ జనసేనతో పాటు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నాగబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అలాగే వర్మకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ జోక్యం చేసుకుని అభిమానుల్ని సర్దిచెప్పి అక్కడి నుంచి పంపిస్తున్నారు. దీంతో ఉద్రిక్తతల మధ్యే నాగబాబు పిఠాపురం టూర్ కొనసాగుతోంది.
గత ఎన్నికలకు ముందు పిఠాపురంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వర్మను చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు పోటీ నుంచి తప్పించారు. అదే సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో గెలిచాక మాత్రం పవన్ సూచన మేరకు ఎమ్మెల్సీ సీటు హామీ మర్చిపోవడంతో పాటు ఆయన్ను దూరం పెడుతున్నారని అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వర్మపై చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి. ఇప్పుడు నాగబాబు టూర్ పై వీటి ప్రభావం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications