రఘురామకు హైకోర్టు షాక్-చింతామణి నాటకం నిషేధంపై స్టేకు నో
ఏపీలో చింతామణి నాటకం ప్రదర్శనపై వైశ్య సామాజికవర్గం నుంచి గతంలో వలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా ప్రదర్శిస్తున్న ఈ నాటకంపై వైశ్యుల అభ్యంతరాల్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ సర్కార్ నిషేధం విధించింది. నాటకాన్ని ఎక్కడా ప్రదర్శించరాదని ఆంక్షలు విధించింది. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఏపీలో చింతామణి నాటకం ప్రదర్శనను నిషేధిస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ తీర్పు వెలువరించింది. రఘురామరాజు కోరినట్లుగా చింతామణి నాటకంపై విధించిన నిషేధంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు ఈ సందర్భంగా నిరాకరించింది. అయితే దీనిపై తదుపరి విచారణ చేపడతామని ప్రకటించింది.

చింతామణి నాటకం నిషేధంపై రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ లో ఆయన తరపున ప్రముఖ న్యాయవాది ఉమేష్ వాదనలు వినిపించారు. చింతామణి నాటకాన్ని నిషేధించడం వాక్ స్వాతంత్రాన్ని హరించడమేనని ధర్మాసనం ముందు ఉమేష్ వాదించారు. నాటకాన్ని నిషేధించిన కారణంగా పలువురు జీవన ఉపాధి కోల్పోయారని తెలిపారు.
దేవదాసి చట్టానికి వ్యతిరేకంగా ఈ నాటకం వచ్చిందన్నారు. నాటకాన్ని నిషేధించాల్సిన అవసరంలేదని కోర్టుకు తెలిపారు. నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు.
అయితే ఉమేష్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అలాగే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి కూడా హైకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. నాటకానికి సంబంధించిన అసలు పుస్తకం ట్రాన్స్లేట్ వెర్షన్ సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇఛ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 17 కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications