విజయవాడలో వైసీపీకి బిగ్ షాక్-సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ముఖ్యంగా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏకపక్ష విజయాలు కైవసం చేసుకున్న స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ప్లేటు ఫిరాయించేస్తున్నారు. ఇప్పటికిప్పుడు వీటితో ఎలాంటి ఉపయోగం లేకపోయినా ఫిరాయింపుల పర్వం మాత్రం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఇవాళ విజయవాడ వైసీపీ కార్పోరేటర్లు టీడీపీలో చేరారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మూడు డివిజన్ల వైసీపీ కార్పోరేటర్లు ఎంపీ కేశినేని శివనాధ్ సమక్షంలో పచ్చ కండువా కప్పుకున్నారు. వీరిలో మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ ఉన్నారు. వీరంతా బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు కావడం విశేషం. ప్రస్తుతం కార్పోరేషన్ లో వైసీపీ మేయర్ ఉన్న నేపథ్యంలో వీరి చేరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. అప్పటి నుంచీ కార్పోరేషన్ లో వైసీపీ ఆధిపత్యమే సాగుతోంది. అయితే తాజాగా విజయవాడ కార్పోరేషన్ స్థాయీ సంఘం ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో కూటమి సర్కార్ కార్పోరేటర్లపై ఫోకస్ పెట్టింది. దీంతో ఇవాళ ముగ్గురు కార్పోరేటర్లు టీడీపీలో చేరారు. త్వరలో మరికొందరు వైసీపీ కార్పోరేటర్లను కూడా చేర్చుకునేందుకు కూటమి పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. అయినా వచ్చే ఏడాది వరకూ కార్పోరేషన్ ను చేజిక్కించుకోవడం అయితే కష్టమే.












Click it and Unblock the Notifications