'రాజధానిలో 10వేలమందితో భద్రత', నిన్న తిట్టి.. జగన్కు ఊహించని మద్దతు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు 12 హెలికాప్టర్లు, 3 వివిఐపీ హెలికాప్టర్లు ఏర్పాటు చేశామని ఐజీ సంజయ్ గురువారం నాడు చెప్పారు. శంకుస్థాపన కోసం పదివేల మందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని మోడీతో పాటు సామాన్యులకు సైతం ఇబ్బంది లేకుండా భద్రత ఉంటుందన్నారు.
స్వచ్ఛభారత్లో పాల్గొన్న ఏపీ మంత్రి నారాయణ
రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో 3లక్షల టాయ్లెట్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు.
నగరంలో చేపట్టాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఆధునికీకరణ పనులపై అధికారులతో చర్చించారు. అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం దగ్గరపడుతున్న సమయంలో ప్రముఖుల రాక దృష్ట్యా విజయవాడను సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
అనంతరం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గోడ పత్రికలను తొలగించే కార్యక్రమం ప్రారంభించారు. అధికారులతో పాటు మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు స్వయంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
పారిశుద్ధ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అందుకే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలతో ముందుకెళుతున్నట్లు వివరించారు. రానున్న మార్చి నాటికి అన్ని పురపాలక సంస్థల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
జగన్కు ఊహించని మద్దతు!
ప్రత్యేక హోదా కోసం గుంటూరు జిల్లా నల్లపాడులో నిరవధిక దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని మద్దతు లభించింది! వైయస్కు సన్నిహితుడిగా ఉన్న ఉండవల్లి... వైయస్ మృతి అనంతరం జగన్ కాంగ్రెస్ పార్టీని వీడాక యువనేత పైన నిప్పులు చెరిగారు.
అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్... జగన్ దీక్షకు మద్దతు పలికారు. జగన్ దీక్ష సఫలం కావాలని ఆకాంక్షించారు. ఉండవల్లి ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పైన పుస్తకం రాశారు. దానిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. విభజన విషయంలో అడ్డగోలుగా వ్యవహరించారని, కాంగ్రెస్, బిజెపిలు ఇచ్చిన మాట తప్పాయన్నారు. విభజన జరిగి ఏడాదిన్నర అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదాపై వెంకయ్య సినిమా చూపించారన్నారు. హోదా కోసం జగన్ చేస్తున్న దీక్ష సఫలం కావాలన్నారు. ఇప్పటికైనా కేంద్రం మనసు మారాలన్నారు.
అమరావతిని సింగపూర్కు, పోలవరంను జర్మనీకి అప్పగిస్తారా?: మధు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారశైలిని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తప్పుబట్టారు. ప్రత్యేక హోదాను సాధించడం కోసం సీఎం చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు.
హోదాను సాధించేందుకు జగన్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపారు. అమరావతి నిర్మాణాన్ని సింగపూర్కు, పోలవరం ప్రాజెక్టును జర్మనీకి అప్పగిస్తారా? అంటూ ప్రభుత్వంపై మధు విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని విదేశాలకు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.