చిత్తూరులో విషాదం: వెంకటేశ్వర హేచరీస్లో ఏడుగురు కార్మికులు మృతి
చిత్తూరు:జిల్లాలోని పలమనేరు మండలం మొరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర హేచరీస్లో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజీ శుభ్రం చేయడానికి వెళ్లిన ఏడుగురు కార్మికులు.. అందులో ఊపిరాడక మృతి చెందారు.
ట్యాంక్ నుంచి ఒక్కసారిగా విష వాయువు వెలువడటంతో మరో ఎనిమిదిమంది అస్వస్థతకు గురయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
డ్రైనేజీలో దిగినవారిలో మొదట నలుగురు కార్మికులు అందులోనే స్పృహ కోల్పోయారు. వాళ్లను పైకి లాగే క్రమంలో మరో ముగ్గురు కార్మికులు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు హుటాహుటిన అక్కడకు చేరుకుని డ్రైనేజీ పైకప్పును తొలగించి వారిని బయటకు తీశారు.
వారందరిని ఆసుపత్రికి తరలిస్తుండగా నలుగురు మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సమాచారం.
మృతులను రమేష్(32), గోవిందస్వామి(35), రెడ్డప్ప(30), రామచంద్ర(22), బాబు(20) కేశవ, వెంకటరాజులుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.