85 వేల కోట్లు: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించింది.
జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్ఫ్రా ట్రాన్స్పరెన్సీ యాక్ట్ 2019 రిపీట్ చేయాలని క్యాబినెట్లో ప్రతిపాదించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకి కుదిస్తూ కీలక సవరణ చేశారు.

ఏపీ టవర్స్ లిమిటెడ్ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో విలీనం చేసేందుకు మంత్రివర్గం ఆమోదించింది. ఏపీ టవర్స్ లిమిటెడ్కు చెందిన మూలధనం, ఆస్తులు, అప్పులు బదలాయిస్తూ సమావేశంలో ప్రతిపాదన చేశారు. రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
2024-25 కొత్త క్రీడా పాలసీకి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కొటిక్ గ్రూప్)గా మారుస్తూ క్యాబినెట్ తీర్మానించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కోసం గృహ నిర్మాణ శాఖ చేసుకోనున్న ఒప్పందానికి క్యాబినెట్లో తీర్మానం చేసింది.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. అమరావతి సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను క్యాబినెట్ ఆమోదించింది. టెండర్లు పిలిచి అమరావతి పనులు కొనసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు చేసింది.
ఆలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించే చట్టసవరణ బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. మరోవైపు, పీడీ యాక్ట్ పటిష్ఠం చేస్తూ సవరణ బిల్లుకు, లోకాయుక్త చట్టసవరణ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపంది. లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనేదానిపై కేబినెట్ చర్చించింది. పార్లమెంట్లో అనుసరించిన విధానం కొనసాగించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications