TTD: లడ్డూ వ్యవహారంలో ఎలాంటి అనుమానాలు వద్దు, టీటీడీ ఈవో
తిరుమల లడ్డూలలో జంతు కొవ్వులు కలిపారని వెలుగు చూడటంతో కోట్టాది మంది హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా సోమవారం శాంతి హోమం చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. సోమవారం శ్రీవారి ఆలయంలో శాంతి హోమం, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించామని టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు చెప్పారు.
శ్రీవారి ఆలయంలో శాంతి హోమం నిర్వహించిన తరువాత ఆలయం వెలుపల టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే శ్రీవారికి మహానైవేద్యం పూర్తి చేశామని అన్నారు. శ్రీవారి ఆలయంలో అన్ని విభాగాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తి చేశామని శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు.

శ్రీవారి ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో కల్తీ కారణంగా శ్రీవారి ఆలయంలో హోమాన్ని నిర్వహించామని, హోమం పూర్తి అయిన తరువాత లడ్డూ పోటుతో పాటు ఆలయంలో పంచగవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమాని నిర్వహించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. ఉదయం 6 గంటల నుంచి మహా శాంతి హోమం నిర్వహించారు. ముందుగా మహ శాంతియాగం, వాస్తూ హోమం నిర్వహణ జరిగిందని తెలిసింది. చివరిగా పంచగవ్యాలతో అర్చకులు సంప్రోక్షణ నిర్వహించారు. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్క రోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారని తెలిసింది.

తిరుమల లడ్డూల తయారికి పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. పవిత్రోత్సవాకు ముందు నెయ్యి మార్చడం వలన అంతుకు ముందు జరిగిన దోషాలు పోయాయని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదాలు విషయంలో ఇక ముందు ఎలాంటి అనుమానాలు, అపోహలు వద్దని టీటీడీ ఈవో శ్మామలరావు శ్రీవారి భక్తులకు మనవి చేశారు.












Click it and Unblock the Notifications