చిరంజీవి ప్రజలను మోసం చేశారు: షర్మిల, బాబుపై ఫైర్
ప్రకాశం: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన కేంద్రమంత్రి చిరంజీవి, తనకు ఓటు వేసిన ప్రజలను మోసం చేశారని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారం కోసం తన సొంత మామనే వెన్నుపోటు పొడిచారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల ఆరోపించారు. ఆమె శుక్రవారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో రోడ్ షో నిర్వహించారు. మంచోడని నమ్మి అతని కూతురును ఇచ్చి వివాహం చేసి, అతన్ని టిడిపిలో చేర్చుకుంటే ఎన్టీఆర్ను చంద్రబాబు మోసం చేశారని ఆమె ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో వృద్ధులకు పెన్షన్లు కూడా సరిగా ఇవ్వలేదని షర్మిల విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన పథకాలను చంద్రబాబు ఇప్పుడు తెస్తామనడం.. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమేనని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించే సాహాసం చేసిందంటే దానికి కారణం చంద్రబాబేనని ఆమె ఆరోపించారు.
పేద విద్యార్థుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యనందించారని, రాష్ట్రంలోని 71 లక్షల మంది వృద్ధులకు పెన్షన్లు అందించారని షర్మిల తెలిపారు. రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అందించారని చెప్పారు. పేదలకు ఇల్లు కట్టించారని, ఆరోగ్యశ్రీ ద్వారా పెద్దాసుపత్రిలో వైద్యాన్ని అందించారని షర్మిల తెలిపారు. వైయస్ చనిపోయాక ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి అన్నింటి ధరలు పెంచేశారని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి కరెంటు ఛార్జీల వరకు అన్నింటీ ధరలను కిరణ్ కుమార్ రెడ్డి పెంచారని అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి అధ్వన్నంగా పాలిస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏనాడు ప్రశ్నించలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని షర్మిల ఆరోపించారు. వైయస్ ఆశయాలు మళ్లీ అమలు కావాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని షర్మిల అన్నారు. జగన్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రాజన్న రాజ్యం రావాలంటే ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.