కర్నూల్ టీడీపీ నాయకులకు షాక్: సంజాయిషీ నోటీసులు జారీ చేసిన శిల్పా!
కొత్తపల్లి మండలం జడ్పీటీసీ ఎస్.పురుషోత్తంరెడ్డి, పాములపాడు జడ్పీటీసీ వై. దుశ్శంత్రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని శిల్పా చక్రపాణి ఆరోపిస్తున్నారు.
కర్నూలు: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొంతమంది టీడీపీ నాయకులు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి శుక్రవారం వారికి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు.
కొత్తపల్లి మండలం జడ్పీటీసీ ఎస్.పురుషోత్తంరెడ్డి, పాములపాడు జడ్పీటీసీ వై. దుశ్శంత్రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని శిల్పా చక్రపాణి ఆరోపిస్తున్నారు.
వీరితో పాటు శాలివాహన ఫెడరేషన్ చైర్మన్ తుగ్గలి నాగేంద్రకు కూడా సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. పత్తికొండలో నిర్వహించిన ఎన్నికల సమావేశానికి ఉద్దేశపూర్వకంగా హాజరు కాకపోగా స్థానిక నాయకత్వాన్ని తుగ్గలి నాగేంద్ర వ్యతిరేకిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. అందువల్లే సంజాయిషీ నోటీసులు జారీ చేయాల్సి వచ్చిందన్నారు.
టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకే ఈ సంజాయిషీ కోరడం జరిగిందని, వారు పంపే వివరణలు కూడా తిరిగి అధిష్టానానికి పంపుతామని శిల్పాచక్రపాణిరెడ్డి తెలిపారు. నోటీసులపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.