రోజా ఎక్కడుంటే అక్కడ అల్లరి, అశ్లీలతా ఆసభ్యత: శోభా హైమవతి
హైదరాబాద్/ గుంటూరు: అవినీతి, హత్యరాజకీయాలతో పాటు అసభ్యత, అశ్లీలత కూడా వైయస్సార్ కాగ్రెసు ఖాతాలో చేరాయని తెలుగుదేశం పార్టీ మహిళా నేత శోభా హైమవతి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రోజా ఎక్కడ ఉంటే అక్కడ అల్లరి, వివాదమే అని మండిపడ్డారు.
రోజాపై మూడు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరో శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరిని, రోజాను అడ్డం పెట్టుకొని జగన్ రాజకీయాలు చేస్తున్నారని శోభా హైమావతి విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనితకు రోజా క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ వ్యవహారాలపై కోర్టుకు వెళ్లటం సాధ్యం కాదన్నారు. బాక్సైట్ జీవోను రద్దు చేయటంపై వైసీపీ వైఖరి తెలపాలని డొక్కా అన్నారు.
భారత్లో ఏ ముఖ్యమంత్రి కూడా క్రైస్తవుల కోసం తమ ముఖ్యమంత్రి చంద్రబాబులా ఆలోచించలేదని మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. క్రైస్తవులకు ఇచ్చిన మాట ప్రకారం క్రిస్టియన్ భవన్ని కేటాయించారన్నారు. కొందరు నేతలు తాము క్రైస్తవులమని చెప్పుకొని ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. బైబిల్ పట్టుకుని తిరుగుతూ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి రావెల ఆరోపించారు.