సీఎం జగన్ డెసిషన్ కు హైకోర్టు బ్రేక్ : టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల జీవో సస్పెండ్ : ప్రమాణ స్వీకారానికి మందే..!!
ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న మరో కీలక నిర్ణయానికి హైకోర్టు తాత్కాలికంగా బ్రేకులు వేసింది. ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుల నియమాకం లో కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. బోర్డు ఏర్పాటు సమయంలో ముఖ్యమంత్రి జగన్ పైన పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది. కేంద్ర మంత్రుల మొదలు..పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం తమ వారికి అవకాశం కల్పించాలంటూ సిఫార్సులు చేసారు. అయితే, ఒత్తిడి..పోటీ దారులు ఎక్కువగా ఉండటంతో సీఎం జగన్ ఛైర్మన్ గా సుబ్బారెడ్డి ని ముందుగానే నిర్ణయించారు.
50 మందితో ప్రత్యేక ఆహ్వానితులతో
ఆ తరువాత దేవాదాయ శాఖ నిబంధనల మేరకు 25 మంది తో రెగ్యులర్ సభ్యులతో బోర్డును ఏర్పాటు చేసారు. అదే విధంగా 50 మందితో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో తెలుగు రాష్ట్రాలో పాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారికీ అవకాశం కల్పించారు. దీంతో..81 మందితో జంబో టీటీడీ బోర్డు ఏర్పాటు అయింది. ఇక్కడే ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది. రెగ్యులర్ సభ్యులకు మాత్రమే పాలనా పరమైన..విధాన పరమైన నిర్ణయాల్లో పాల్గొంటారని..ప్రత్యేక ఆహ్వానితులకు ఆ అవకాశం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
హైకోర్టులో పలువురి పిటీషన్లు
అయితే, ఇంత పెద్ద సంఖ్యలో నియామకాలు చేయటం పైన పలువురు అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బోర్డులో అవకాశం పొందిన కొందరి నియామకం పైన అభ్యంతర వ్యక్తం చేసారు. అదే సమయంలో బీజేపీ నేతలు ఈ నియామకాలపైన గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసారు. బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి..టీడీపీ అనంతపురం నేత ఉమా మహేశ్వర రాయుడు తో పాటుగా మరి కొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే విచారణ చేసి ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవో రద్దు చేయాలని కోరారు.
నిబంధనల ప్రకారమే అంటున్న ప్రభుత్వం
అయితే, అంత త్వరగా విచారించాల్సిన అవసరం ఏంటని కోర్టు ప్రశ్నించింది. ఆలస్యం అయితే బోర్డు సభ్యులుగా వారు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వారంతా కోర్టు ముందు వాదనలు వినిపించారు. దీంతో.. హైకోర్టు విచారణ నిర్వహించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీచేసిన జీవో సస్పెండ్ చేస్తూ ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీని ద్వారా ప్రభుత్వ జీవోను తాత్కాలిక నిలుపుదల చేసారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని పిటిషనర్ వాదనలు పిటీషన్ల తరపు న్యాయవాదులు వినిపించారు.
జీవో పై స్టే ఇస్తూ..మధ్యంతర ఉత్తర్వులు
ఈ నియామకాలు తిరుమల తిరుపతి దేవస్థానం స్వతంత్రను దెబ్బ తీసేలా ఉన్నాయని పిటీషనర్లు వాదించారు. అయితే, నిబంధనలకు అనుగుణంగానే నియామకాలు చేపట్టామని ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు. ఇంత భారీ స్థాయిలో నియామకాల ద్వారా సామాన్య భక్తులపై భారం పడుతుందని వాదించిన పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు జీవో ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, బోర్డులో సభ్యత్వం దక్కటంతో హర్షం వ్యక్తం చేసిన సభ్యులు ఇప్పుడు కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఇరకాటం లో పడ్డారు.