ఆర్కే బీచ్ లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వారిపై కేసు నమోదు
ఆర్కే బీచ్ లో అదృశ్యమై ప్రియుడితో కలిసి తిరిగి విశాఖకు వచ్చిన సాయి ప్రియ కేసులో ఆసక్తికరమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. సాయి ప్రియపై, ఆమె ప్రియుడు రవితేజపై కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రియుడితో వెళ్ళిపోయిన సాయిప్రియ కేసు
జులై 25 వ సాయిప్రియ దంపతులు పెళ్లి రోజు కావటంతో విశాఖ బీచ్ కు వెళ్ళారు. విశాఖ బీచ్ లో భర్తని ఏమార్చి ప్రియుడితో కలిసి సాయి ప్రియ వెళ్లిపోగా, తన భార్య సముద్రంలో గల్లంతయింది అని భావించిన భర్త ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు, నేవీ రంగంలోకి దిగి సాయి ప్రియ కోసం గాలించడం, ఆమె కోసం కోటి రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి గాలింపు చేపట్టిన విషయం తెలిసిందే.

కోటి రూపాయల ప్రజాధనం, అధికారుల సమయం వృధా
ఇక ఆ తర్వాత సాయి ప్రియ తన ప్రియుడితో వెళ్లిపోయానని తనకోసం వెతకొద్దు అంటూ తన తల్లిదండ్రులకు సందేశాన్ని పంపటం తెలిసిందే. బెంగళూరులో ప్రియుడితో ఉన్న సాయిప్రియను గుర్తించిన పోలీసులు వారిని తిరిగి తీసుకు వచ్చిన తర్వాత సాయి ప్రియ, ఆమె ప్రియుడు తమవల్ల కోటి రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని, పోలీసులు, నేవీ అధికారులకు ఇబ్బంది కలిగిందని తమని క్షమించాలని చెప్పి వెళ్లిపోయారు.

పోలీసులను, నేవీని తప్పుదోవ పట్టించినందుకు సాయిప్రియ, ఆమె ప్రియుడిపై కేసు
అయితే తాజాగా ఈ వ్యవహారంలో పోలీసులను, ప్రభుత్వ సంస్థలను తప్పుదోవ పట్టించినందుకు 21 ఏళ్ల వివాహిత సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై వైజాగ్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. విలువైన అధికారిక వనరులు వృధా అయినందున, ఈ సంఘటనలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోస్ట్ గార్డ్ వైజాగ్ పోలీసులను అభ్యర్థించింది. ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడమే కాకుండా అధికారుల సమయాన్ని వృధా చేసినందుకు కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేశారు.

భర్త ఫిర్యాదు.. కోర్టు అనుమతితో కేసు నమోదు చేసిన పోలీసులు
కోర్టు అనుమతితో సాయిప్రియ, రవితేజలపై ఐపీసీ సెక్షన్ 429, 417, 494, 202 ఆర్/డబ్ల్యూ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సాయి ప్రియ భర్త శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కూడా త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. పెళ్లి చేసుకున్న తర్వాత తనను ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం తో పాటు, సాయి ప్రియ జిల్లా యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించిందని సాయి ప్రియ భర్త శ్రీనివాసరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ ఫిర్యాదుతో, కోర్టు ఆదేశాలతో సాయి ప్రియ పై కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ రామారావు వెల్లడించారు.












Click it and Unblock the Notifications