జగన్ అక్రమాస్తుల కేసులో శ్యాంప్రసాద్ రెడ్డికి ఊరట
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఇందూ శ్యాంప్రసాద్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇందూ టెక్జోన్, ఇందూ-హౌసింగ్ బోర్డు చేపట్టిన ప్రాజెక్టుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే అరోపణలకు సంబంధించి శ్యాంప్రసాద్రెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి.
ఇందుకు సంబంధించి సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వీటిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో బుధవారం విచారించారు. పిటిషనర్ తరపున న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డి వాదించారు.

వ్యాపార కార్యకలాపాల కోసం ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి వస్తున్నదని, ప్రతి వారం కేసు విచారణకు హాజరు కావాలనే నిబంధనల వల్ల వెళ్లలేకపోతున్నారని, ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
ఈ వ్యాజ్యాల్లో వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని సీబీఐ తరపు న్యాయవాది కేశవరావు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆయా కేసుల్లో శ్యాంప్రసాద్రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.












Click it and Unblock the Notifications