మహిళ పట్ల అసభ్య ప్రవర్తన: ఎస్సై సస్పెన్షన్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ఎస్సై రామయ్య పైన గురువారం నాడు సస్పెన్షన్ వేటు పడింది. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎస్సైని అధికారులు సస్పెండ్ చేశారు. అతని పైన అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
అనుమతి లేని బాణసంచా కేంద్రాలపై కఠిన చర్యలు
విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో బాణసంచా పేలుళ్ల ఘటనలపై డీజీపీ రాముడు గురువారం నాడు సమీక్ష నిర్వహించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఎస్పీ స్థాయి అధికారితో బాణసంచా తయారీ కేంద్రాలను తనిఖీ చేయించాలని సూచించారు.
అనుమతి లేని బాణసంచా కేంద్రాల పైన కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ ఉంచడం చట్ట వ్యతిరేకమన్నారు. అనుమతి లేని గోదాంలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్హెచ్ఓలు సైతం అకస్మిక తనిఖీలు చేయాలన్నారు.
గుంటూరు జిల్లాలో నాటు బాంబు పేలుళ్లు
గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయి పాలెంలో గురువారం నాటు బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. రాంరెడ్డి ఇంట్లో బాంబులు పేలాయి. ఐదు నాటు బాంబులు పేలడంతో జనం ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదు వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు.