రాజమండ్రికి సింగపూర్ బృందం: 'చంద్రబాబు అనుమతిస్తే రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటాం'
రాజమండ్రి: ఏపీ రాజధాని సీడ్ క్యాపిటల్ ప్లాన్ను ప్రభుత్వానికి అందజేసేందుకు గాను సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో పాటు 30 మంది సభ్యుల బృందం రాజమండ్రికి బయలుదేరింది. ఏపీ మంత్రి రావెల కిషోర్బాబు సింగపూర్ ప్రతినిధుల బృందాన్ని పత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజమండ్రికి తీసుకెళ్లారు.
రాజమండ్రిలో సీఎం చంద్రబాబు నాయుడుతో సింగపూర్ ప్రతినిధుల బృందం భేటీ అవుతుంది. ఈ భేటీలో మంత్రి ఈశ్వరన్ చంద్రబాబు నాయుడుకు ఏపీ సీడ్ క్యాపిటల్కు సంబంధించిన ప్లాన్కు అందజేస్తారు. అంతేకాదు సీడ్ క్యాపిటల్ ప్లాన్పై 30 మంది సభ్యుల బృందం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంజేషన్ ఇవ్వనున్నారు.
రాజధానిని 4000 ఎకరాల ప్రాంతంలో ఏవిధంగా నిర్మించనున్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందులో ఉన్నాయి. నవ్యాంధ్ర నిర్మాణం ఎలా ఉండాలనే అంశంపై సాయంత్రం 4 గంటలకు హైలెవెల్ కమిటీ మీటింగ్ సమావేశం జరగనుంది. అనంతరం సింగపూర్ మంత్రి ఈశ్వరన్, సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడతారు.
నవ్యాంధ్ర నూతన రాజధాని అత్యాధునిక సౌకర్యాలతో పాటు ఆకర్షణీయంగా ఉండాలనే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలను ఏపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి అప్పజెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో అత్యంత కీలకమై సీడ్ క్యాపిటల్ ప్లాన్ను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సోమవారం సీఎం చంద్రబాబుకు ఇవ్వనున్నారు.
ఇది ఇలా ఉంటే ఏపీ ప్రభుత్వం అనుమతిస్తే నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా సీడ్ క్యాపిటల్ ప్లాన్ను రూపొందించామని తెలిపారు.
ఈ సీడ్ క్యాపిటల్ ప్లాన్ ప్రజల ఆకాంక్షలను నెరువేర్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎంతో పవిత్రమైన గోదావరి మహా పుష్కరాల్లో పాల్గొనాలని ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.
రాజమండ్రి చేరుకున్న సింగపూర్ బృందం:
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలోని 30 మంది సభ్యుల బృందం రాజమండ్రికి చేరుకుంది. రాజమండ్రి విమానాశ్రయంలో ఈ బృందానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారాయణ, అధికారులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఈశ్వరన్, చంద్రబాబు షెల్టాన్ హోటల్కు ఒకే కారులో బయలుదేరి వెళ్లారు.