బిడ్డ త్యాగం గర్వంగా ఉంది, ఆయన లొంగరు: ఆర్కె భార్య
ఒంగోలు: తన కుమారుడు పృథ్వీ అలియాస్ మున్నా మరణం బాధ కలిగించినా పీడిత ప్రజల కోసం ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందని మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కె భార్య శిరీష అన్నారు. ప్రజల కోసం ప్రాణాలు సైతం ఇచ్చేందుకు వెనకాడబోనని మున్నా తనతో చెప్పినట్లు ఆమె తెలిపారు.
లొంగిపోతే ఆర్కెకు చికిత్స చేయిస్తామని ప్రభుత్వం చెప్పే మాటలు బూటకమని ఆమె అన్నారు. ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లతో బెదిరించినంత మాత్రాన ఆర్కె లొంగిపోరని ఆమె గురువారం మీడియాతో అన్నారు. ఆంధ్ర - ఒడిషా సరిహద్దుల్లో మోహరించిన పోలీసు బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలని ఆమె డిమాండ్ చేశారు
మల్కాన్గిరిలో జరిగింది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనని ఆమె అన్నారు. ఇది ప్రభుత్వం చేసిన అతి పెద్ద ఘోరమని, రాత్రి నిద్రిస్తున్నవారిపై దొంగ దెబ్బ తీసి పొట్టన పెట్టుకున్నారని ఆమె అన్నారు పోలీసులు ఏ విధమైన ముందస్తు హెచ్చరికలు చేయకుండా అందరినీ బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారని ఆణె ఆరోపించారు.
ఈ నెల 24వ తేదీిన జరిగిన ఎవోబీ ఎన్కౌంటర్లో ఆర్కె తనయుడు పృథ్వి అలియాస్ మున్నా మరణించిన విషయం తెలిసిదే. ఇప్పటి వరకు మల్కాన్గిరి సంఘటనల్లో 30 మంది మావోయిస్టులు మరణించారు.