Sex Education: కేంద్రం చారిత్రాత్మక అడుగు! స్కూళ్లు, కాలేజీల్లో ఇక కొత్త సిలబస్
దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పునకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. స్కూళ్లు, కాలేజీల్లో కాంప్రిహెన్సివ్ సెక్స్ ఎడ్యుకేషన్ను ఒక ప్రధాన పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సిద్ధం చేసిన ప్రత్యేక కమిటీ నివేదికను ఆమోదించినట్లు, సుప్రీంకోర్టు నుంచి అనుమతి లభించడమే తరువాయి దేశవ్యాప్తంగా దీనిని అమలు చేస్తామని కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి వివరించింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సోమవారం ఈ వివరాలను వెల్లడించారు.
ఎందుకీ నిర్ణయం?
కౌమారదశలో (Adolescence) ఉండే నవయువకులు పరస్పర అంగీకారంతో జరిపే ప్రేమాయణాలు, లేదా మైనర్ గర్భధారణ కేసులు నేరుగా 'పోక్సో' (POCSO) చట్టం కిందకు వచ్చి నేరాలుగా మారుతున్న తీరుపై సుప్రీం కోర్టు గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్య పరిష్కారానికి, అలాగే మైనర్ల ప్రైవసీ హక్కులకు భంగం కలగకుండా చూసేందుకు మార్గాలను అన్వేషించాలని కేంద్రాన్ని కోరింది.

దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. మహిళా, శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో నిపుణులు, మనస్తత్వ శాస్త్రవేత్తలతో కూడిన ఒక 26 మంది సభ్యుల జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నిపుణుల బృందం లోతుగా అధ్యయనం చేసి, విద్యార్థుల్లో అవగాహన పెంచడమే దీనికి సరైన పరిష్కారమని తేల్చి చెప్పింది.
నిపుణుల కమిటీ చేసిన ప్రధాన సిఫార్సులు ఇవే..
- కాంప్రిహెన్సివ్ సెక్స్ ఎడ్యుకేషన్: లైంగిక విద్యతో పాటు, చిన్న పిల్లలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ అంశాలను పాఠశాలల ప్రధాన సిలబస్లో చేర్చాలి.
- ప్రైమరీ స్థాయి నుంచే అవగాహన: ప్రాథమిక తరగతుల (ప్రైమరీ స్కూల్) నుంచే పిల్లల వయసుకు తగినట్లుగా శరీర భాగాలు, వ్యక్తిగత పరిశుభ్రత, మరియు 'మంచి స్పర్శ - చెడు స్పర్శ' (Good Touch - Bad Touch) లాంటి ప్రాథమిక విషయాలపై అవగాహన కల్పించాలి.
- వారానికి రెండు సార్లు క్లాసులు: ప్రైమరీ స్కూల్ స్థాయి నుంచే వారానికి కనీసం రెండు సార్లు 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ అంశాలపై ప్రత్యేక తరగతులు తప్పనిసరిగా నిర్వహించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలి.
- తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్: పిల్లల ఎదుగుదల దశల్లో వచ్చే శారీరక, మానసిక మార్పులపై తల్లిదండ్రులకు, సంరక్షకులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి.
- కొత్త సిలబస్: నూతన విద్యా విధానం (NEP) 2020 నిబంధనలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించాలని ఎన్సీఈఆర్టీ (NCERT) సంస్థను కోరింది.
ఈ కమిటీ ఇచ్చిన పూర్తి నివేదికను పరిశీలించిన తర్వాత తగిన ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన గనుక అమల్లోకి వస్తే లైంగిక విద్యపై సమాజంలో ఉన్న అపోహలు తొలిగిపోవడమే కాకుండా, చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడానికి బలమైన పునాది పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications