జోగి రమేశ్ పాత్రపై విచారణ, కీలక మలుపు..!!
ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్న నకిలీ మద్యం కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ పాత్రపై పోలీసులు ఫోకస్ చేసారు. ఇప్పటికే ఈ కేసులో సిట్ ఏర్పాటు అయింది. తాజాగా ఏ-1 జనార్ధన్ విడుదల చేసిన వీడియోలో జోగి రమేశ్ పాత్ర పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో.. వీరిద్దరి మధ్య సంబంధాలు.. లావాదేవీల పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, జోగి రమేశ్ మాత్రం ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదంటున్నారు.
కొద్ది రోజులుగా రాష్ట్రంలో సంచలనంగా మారిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏ-1గా ఉన్న జనార్ధన్ వీడియో తాజాగా బయటకు వచ్చింది. అందులో వైసీపీ నేత.. మాజీ మంత్రి జోగి రమేశ్ తన వెనుక ఉన్నట్లు వెల్లడించారు. దీంతో.. ఇప్పుడు విచారణ అధికారులు ఈ ఇద్దరి మధ్య సంబంధాల పైన ఆరా తీస్తున్నారు.

జనార్ధన్ ఆఫ్రికా వెళ్ళేముందు జోగి రమేశ్ తో సమావేశం అయినట్లు ప్రాధమికంగా సమాచారం సేకరించిన అధికారులు.. ఈ మేరు జోగి రమేశ్ ఇంటి వద్ద సీసీ టీవీ ఫుటేజ్ సేకరిస్తున్నారు. అదే విధంగా వీరిద్దరి మధ్య ఏమైనా ఆర్దిక లావాదేవీలు.. చర్చలు జరిగాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇందు కోసం జోగి రమేశ్ తో పాటుగా సమీప ఇళ్లల్లోని సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయం నుంచి జోగి రమేశ్ వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉండేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఇంటి వద్ద వివాదంతో పాటుగా అగ్రిగోల్డ్ వ్యవహారం లోనూ జోగి పైన ఆరోపణలు ఉన్నాయి. తాజాగా నకిలీ మద్యం విషయంలోనూ జోగి రమేశ్ పైన ఆరోపణలు వస్తున్నాయి. జనార్ధన్ విడుదల చేసిన వీడియో వైరల్ గా మారటంతో.. ఇప్పుడు విచారణ అధికారులు జనార్ధన్ ఇచ్చిన సమాచారం పైన ఆరా తీస్తున్నారు.
అయితే, అటు జోగి రమేశ్ మాత్రం నకిలీ మధ్యం కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఎవరో ఒకరి మీద నెపం వేసి ఇరికించాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తాను తిరుపతి లేదా విజయవాడలో దైవ సాక్షిగా ప్రమాణం చేయటానికి సిద్దమని ప్రకటించారు. దీంతో.. ఇప్పుడు విచారణ అధికారులు సేకరించే ఆధారాలు జోగి రమేశ్ పాత్ర పైన స్పష్టత ఇవ్వనున్నాయి.












Click it and Unblock the Notifications