లడ్డూ వివాదంలో ఆ ముగ్గురికీ సిట్ ఉచ్చు..!!
సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదం సిట్ విచారణ ప్రారంభించింది. సిట్ అధికారులు తాజాగా టీటీడీ ఈవో శ్యామల రావుతో సమావేశమయ్యారు. ప్రాధమిక సమాచారం సేకరించారు. తిరుమలకు నెయ్యి టెండర్ల నుంచి సరఫరా చేసిన సంస్థల వరకు అందరినీ విచారణ చేయాలని సిట్ భావిస్తోంది. ఈ మేరకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్దమవుతున్నారు.
విచారణ మొదలు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రెండో రోజు విచారణ కొనసాగిస్తోంది. తదుపరి కార్యాచరణపై దృష్టిపెట్టారు. ఈవోను కలిసిన అధికారులు ఈ వివాదానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన అంశాలు..నివేదికల పైన ప్రాధమికంగా సమాచారంసేకరించారు. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో 9 మంది సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. మూడు బృందాలుగా ఏర్పడి సిట్ విచారణ చేపట్టనుంది.

ఈవోతో సమావేశం
డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అదనపు ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు కొనసాగనుంది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్ పరిశీలిస్తోంది. టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు జరగనుంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై తమిళనాడు వెళ్లనున్న సిట్ సభ్యులు దుండిగల్లో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థను పరిశీలించనున్నారు. తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలను మరో బృందం పరిశీలించనుంది.
నోటీసులు జారీ దిశగా
లడ్డూ తయారీ ముడిసరకులు పరిశీలించనున్న సిట్ సభ్యులు తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను ప్రశ్నించనున్నారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది. నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు పరిశీలించనుంది. నెయ్యి సరఫరాపై టీటీడీ, ఏఆర్ డెయిరీ మధ్య ఒప్పందాలు పరిశీలన చేయనుంది. అదే సమయంలో గత అయిదేళ్లు కాలంలో టీటీడీ బోర్డు ఛైర్మన్లుగా పని చేసిన సుబ్బారెడ్డి, భూమనతో పాటుగా ఈవోగా విధులు నిర్వహించిన ధర్మారెడ్డికి సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications