విశాఖ భూ స్కాం: కీలకదశలో దర్యాప్తు, 68 మందిపై చర్యలకు సిఫారసు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
విశాఖపట్టణం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఎన్వోసీ ఉల్లంఘనుల్లో డిప్యూటీ కలెక్టర్, ఆ పైస్థాయి అధికారులు కూడా ఉండటంతో వారి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో భాద్యులపై వచ్చేవారం అరెస్ట్లుంటాయని సిట్ సభ్యురాలు,. జెసి సృజన చెప్పారు.
ఎన్వోసీల విచారణ పూర్తయేందుకు మరో నెల రోజుల సమయం పడుతుందన్నారు జెసీ. సిట్ దర్యాప్తుపై పూర్తిస్థాయి నివేదికలు తయారు చేసేందుకు సమయం పట్టే అవకాశాలు ఉన్నందున మరో రెండు నెలల సమయాన్ని కోరినట్లు జెసీ చెప్పారు. అయితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. త్వరలో ఉత్తర్వులు వస్తాయన్నారు.
సిట్ పరిధిలో వచ్చిన 337 అర్జీల్లో 260 అర్జీలపై దర్యాప్తు పూర్తయిందని జెసీ చెప్పారు.. తహసీల్దారు కార్యాలయాల్లో రికార్డుల పరిశీలన సమయంలో రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు కూడా పరిశీలించారని జేసీ తెలిపారు. బాద్యులైన 48మందిపై శాఖాపరమైన చర్యలు, 20మందిపై క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు చేశామన్నారు. ఈ 48మందిలో వీఆర్వోల స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకూ ఉన్నారని జెసి చెప్పారు.
ఇప్పటివరకు విచారించిన 260 ఫిర్యాదుల్లో ప్రభుత్వానికి సంబంధించిన 2వేల ఎకరాల భూములు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నట్లు గుర్తించామని వాటిని త్వరలో స్వాధీనం చేసుకుంటామన్నారు. సిట్ పరిగణనలోకి తీసుకున్న 2,500 ఫిర్యాదుల్లో సుమారు 1300 ఫిర్యాదులకు సంబంధించి రిపోర్టులను ఎమ్మార్వోల నుంచి తీసుకున్నామన్నారు.
22(ఎ) లో భూముల సవరణ, యూఎల్సీ ఎన్వోసీ అనుమతి మీ సేవ ద్వారా పొందేందుకు అవకాశం కల్పించామని జేసీ తెలిపారు. ఇది రాష్ట్రంలో మొదటిసారిగా విశాఖ జిల్లాలో ప్రారంభిస్తున్నామన్నారు. 22(ఎ) కు సంబంధించి పాత, కొత్త లిస్టులు ఉన్నాయని చెప్పారు.
గతంలో రికార్డుల మార్పుచేర్పులు వీఆర్వోలకు తెలిసే జరిగాయన్నారు. ప్రస్తుతం రికార్డుల స్వచ్ఛీకరణ వారి బాధ్యతగా తీసుకొని సరైన సమాచారాన్ని పొందుపరచాలని ఆమె హెచ్చరించారు. లేకపోతే రికార్డులు మార్పుచేర్పులకు కారణమైన వాటిపై విచారణ చేస్తానని వారిని హెచ్చరించారు. స్వచ్ఛీకరణకు సహకరిస్తే పాత తప్పులను విడిచిపెడతామన్నారు.