ఏపీలో పొలిటికల్ ఫ్యాక్షన్: జగన్ అలా చేస్తే చంద్రబాబును మర్చిపోయేవారు! పవన్ హోదా వదిలి..
హైదరాబాద్/అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సినీ నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ రాజధాని మార్పుపై ఎన్నికలకు ముందే జగన్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. విశాఖపట్నంలో జగన్ భూములు కొన్న విషయం అందరికీ తెలుసని అన్నారు.
ఏపీలో పొలిటికల్ ఫ్యాక్షన్..
ఓ తెలుగు ఛాననల్తో శివాజీ మాట్లాడుతూ.. రాష్ట్రం నాశనమవుతుంటే ప్రజలు ఎప్పుడు కళ్లు తెరుస్తారని ప్రశ్నించారు. అమరావతిలో కొత్తగా నిర్మించాల్సింది ఏమీ లేదని, భవనాలన్నీ దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. ఏపీలో పొలిటికల్ ఫ్యాక్షన్ నడుస్తోందని తీవ్రంగా స్పందించారు. ఐదేళ్లలో రాజధానిని నిర్మించడం సాధ్యమా? అని శివాజీ ప్రశ్నించారు. ఏపీలో కుల గజ్జి ఉందని, రాజధాని అందరిదనే భావన ప్రజల్లో రావాలన్నారు. ప్రజలందరూ కలిసి పోరాడాలని చెప్పారు. సీఎం జగన్ రాజధానిని మార్చడం ఖాయమని స్పష్టం చేశారు.
జగన్ రాజకీయ పతనం..
రైతుల నుంచి తీసుకున్న భూముల విలువ పెంచి చంద్రబాబు ప్రభుత్వ ఆస్తిగా చేశారని శివాజీ చెప్పారు. భవిష్యత్తులో ఈ ఆస్తి భావి తరాలకు ఉపయోగపడుతుందన్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టినంత మాత్రాన అంత విలువ వస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజలైనా.. సినిమా వాళ్లైనా రాజకీయ నాయకులు ఆడించినట్లు ఆడాల్సిందేనని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులతో సీఎం జగన్ తన రాజకీయ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారని శివాజీ అన్నారు.
అలా చేస్తే చంద్రబాబును మరిచిపోయేవారు..
జగన్ అమరావతిని కొనసాగించి ఉంటే ప్రజలు చంద్రబాబును మరిచిపోయేవారని అన్నారు. విశాఖలో వెయ్యి ఎకరాలు కూడా భూసేకరణ చేయలేరని అన్నారు. రాజధానితో విశాఖకు కూడా లాభమేమీ లేదని అన్నారు. వాలంటీర్ ఉద్యోగాలు వైసీపీ వాళ్లకే ఇచ్చామని విజయసాయి రెడ్డి అన్నారని శివాజీ గుర్తు చేశారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇన్ సైడర్ ట్రేడింగ్ కదా? అని ప్రశ్నించారు. రాజధానికి రూ. లక్ష కోట్లు అవసరం లేదని అన్నారు. అమరావతికి ఇప్పటి వరకు ఖర్చ చేసిన రూ. 10వేల కోట్లు వృథా అయినా పరవాలేదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు కులపిచ్చివుంటే..
చంద్రబాబుకు కుల పిచ్చి ఉంటే కమ్మవాళ్లున్న చోటే కియా మోటార్స్ పెట్టేవాళ్లు కదా? అని శివాజీ ప్రశ్నించారు. ఎన్నికల్లో పెట్టిన డబ్బును తిరిగి సంపాదించుకునేందుకు రాజధాని మార్పు చేస్తున్నారని జగన్ సర్కారుపై ఆరోపణలు గుప్పించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే టీడీపీ నేతలను జైల్లో పెట్టండని శివాజీ అన్నారు.
జగన్ విశాఖలో భూములు కొన్నారని..
విశాఖలో జగన్ భూములు కొన్నారని అందరికీ తెలుసని శివాజీ అన్నారు. జగన్ చెప్పినట్లే బోస్టన్ కమిటీ నివేదిక ఉందని అన్నారు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలంతా పార్టీకి విధేయంగా ఉన్నారని చెప్పారు. అందుకే బయటకు వచ్చి నిరసనలు తెలపడం లేదన్నారు. ప్రత్యేక హోదాను అందరూ వదిలేశారని అన్నారు.
పవన్ కూడా హోదా మరిచి..
ఇక పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని పొగుడుతున్నారని, ప్రత్యేక హోదాను వదిలేశారని అన్నారు. జగన్జగన్ ప్రభుత్వంలో రాజధాని ఉండదు, పోలవరం పూర్తి కాదు, రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందని శివాజీ విమర్శలు చేశారు. రాజకీయ పార్టీలన్నీ బిజినెస్ చేస్తున్నాయని అన్నారు. ఏపీ ప్రజల అనైక్యతే రాజకీయ పార్టీలకు వరమైందన్నారు. ప్రత్యేక హోదాపై జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎప్పుడైనా అడిగారా? అని ప్రశ్నించారు. కుల గజ్జి, కేసుల భయంతోనే అమరావతి కోసం పోరాటానికి ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు.